500 మందికి పైగా రోహింగ్యాలతో రెండు పడవలు అదృశ్యం.. సముద్రంలో కొట్టుకొస్తున్న శవాలు!

Rohingya refugees missing as two boats carrying 500 people disappear at sea
  • బంగాళాఖాతంలో రెండు శరణార్థుల పడవలు అదృశ్యం
  • 500 మందికి పైగా జలసమాధి అయినట్లు అనుమానాలు
  • మయన్మార్, బంగ్లాదేశ్ తీరాలకు కొట్టుకొస్తున్న మృతదేహాలు
  • భీకర రుతుపవన గాలులు, వర్షాల వల్లే ప్రమాదం
  • మయన్మార్ అంతర్యుద్ధం, ఆకలి తట్టుకోలేకే సాహస ప్రయాణాలు
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుండి సుమారు 530 మంది రోహింగ్యా శరణార్థులతో బయలుదేరిన రెండు పడవలు సముద్రంలో అదృశ్యమయ్యాయి. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా శరణార్థులు జలసమాధి అయి ఉంటారని ఐక్యరాజ్యసమితి (యుఎన్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో మైనారిటీ రోహింగ్యాలకు ఎదురైన అత్యంత దారుణమైన సముద్ర ప్రమాదాలలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని మానవతా సంస్థలు పేర్కొంటున్నాయి.

జూన్ 29న మయన్మార్‌లోని సిన్ టెట్ మావ్ గ్రామం నుండి ఈ రెండు పడవలు బయలుదేరాయి. ఒక పడవలో 250 మంది, మరో పడవలో 280 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువ భాగం మహిళలు, పిల్లలే ఉన్నారు. సముద్రంలో ప్రయాణించిన కొన్ని గంటలకే మొదటి పడవతో సంబంధాలు తెగిపోగా, రెండో పడవ జులై 8 ప్రాంతంలో మయన్మార్ తీరానికి సమీపంలో మునిగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బంగాళాఖాతంలో రుతుపవనాల వల్ల భారీ వర్షాలు, భీకర గాలులు, రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. వీటికి తోడు స్మగ్లర్లు వాడిన పాత పడవల్లో ఇంజన్లు చెడిపోవడం, సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించడం వల్లే ఈ ఘోరం జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా ఏ ప్రభుత్వం కూడా అధికారికంగా గాలింపు చర్యలు చేపట్టలేదు. అయితే బంగ్లాదేశ్, మయన్మార్ తీర ప్రాంతాలకు కొట్టుకొచ్చిన కొందరు మహిళలు, పురుషుల మృతదేహాలను మత్స్యకారులు గుర్తించడంతో ఈ పడవలు మునిగిపోయినట్లు స్పష్టమవుతోంది. మయన్మార్‌లో ప్రస్తుతం సైన్యానికి, ఆరకాన్ ఆర్మీకి మధ్య తీవ్రమైన అంతర్యుద్ధం నడుస్తుండటంతో కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ఈ ప్రమాదానికి సంబంధించిన కచ్చితమైన వివరాలను సేకరించడం సహాయక సంస్థలకు సవాలుగా మారింది. ఈ శరణార్థులు సముద్ర మార్గం ద్వారా థాయ్‌లాండ్ చేరుకుని, అక్కడ నుండి రోడ్డు మార్గంలో మలేషియా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు ఈ సాహసాలు?
2017లో మయన్మార్ సైన్యం జరిపిన నరమేధం వల్ల దాదాపు 12 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లో మగ్గుతున్నారు. మరో 6 లక్షల మంది మయన్మార్‌లోనే బందీలుగా జీవిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ సాయం తగ్గడంతో వీరికి తిండి కొరత తీవ్రమైంది. దీనికి తోడు స్థానిక యువకులను బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుంటుండటంతో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీరు ఇలాంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలను ఆశ్రయిస్తున్నారు.
Advertisement
Rohingya refugees
Myanmar boat tragedy
Bay of Bengal
Rakhine State
Humanitarian crisis
Missing boats

More Telugu News