రోహిత్ భవిష్యత్తుపై రచ్చ.. సెలక్టర్లకు బీసీసీఐ వార్నింగ్.. తెరవెనుక ఏం జరుగుతోంది?

Rohit Sharma future controversy BCCI issues serious warning to selectors
  • రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై తీవ్రమవుతున్న ఊహాగానాలు
  • మీడియాతో మాట్లాడొద్దని సెలక్టర్లకు బీసీసీఐ గట్టి ఆదేశాలు
  • పేలవ ఫామ్‌తో జట్టులో రోహిత్ స్థానంపై సెలక్టర్ల అసంతృప్తి
  • ఇంగ్లండ్ సిరీస్‌లోనూ విఫలమవడంతో మళ్లీ ముదిరిన వివాదం
  • రోహిత్ రిటైర్మెంట్ ఊహాగానాలపై స్పందించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా  
  • జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం రోహిత్ ఆడతాడని స్పష్టీక‌ర‌ణ‌
భారత క్రికెట్ జట్టులో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై జరుగుతున్న తీవ్రమైన చర్చ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. జట్టు ఎంపిక విషయాలు, ముఖ్యంగా రోహిత్ అంశంపై మీడియాకు సమాచారం లీక్ కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సెలక్టర్లు మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదని, వారికి పూర్తిగా దూరంగా ఉండాలని గట్టిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్‌తో కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైన తర్వాత లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేనే రోహిత్‌కు చివరి మ్యాచ్ కావొచ్చంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఊహాగానాలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించి, వాటిని కొట్టిపారేశారు. జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం రోహిత్ ఆడతాడని స్పష్టం చేశారు. అయితే, తెరవెనుక మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొంతకాలంగా రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గత 8 వన్డే ఇన్నింగ్స్‌లలో అతను కేవలం 30.12 సగటుతో 241 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో, అతని ఫామ్‌పై కొందరు సెలక్టర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్‌ను ఇకపై వన్డే జట్టులో కొనసాగించడం ఇష్టంలేని ఆ సెలక్టర్లు.. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు ముందే ఈ విషయాన్ని రోహిత్‌కు తెలియజేశారట. తమ ప్రణాళికల్లో అతను లేడని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ చర్చల గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా తెలుసని అంటున్నారు.

అయితే, సెలక్టర్లు తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ, రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐ ఉన్నతాధికారులను ఆశ్రయించి తన వాదన వినిపించినట్లు సమాచారం. దీంతో అతనికి ఆఫ్ఘనిస్థాన్, ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. తన కెరీర్‌ను పొడిగించుకోవాలనే బలమైన ఆకాంక్షతో ఉన్న రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడాలనే కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నాడు.

కానీ, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో సెలక్టర్ల బృందం తమ పాత వైఖరినే మరోసారి రోహిత్‌కు పునరుద్ఘాటించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో రోహిత్ వన్డే కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, భారత క్రికెట్‌లో ఇది ఒక సున్నితమైన అంశంగా మారింది.
Advertisement
Rohit Sharma
BCCI
Indian Cricket Team
Rohit Sharma ODI Retirement
BCCI Warning Selectors
Rohit Sharma 2027 World Cup

More Telugu News