'తారీఖ్ పే తారీఖ్' కాదు.. 25 ఏళ్లుగా సాగుతున్న కేసుపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Allahabad High Court sensational remarks on 25 year old pending case
  • 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కిడ్నాప్ కేసు
  • బాధితురాలు నిందితుడిని పెళ్లాడి ముగ్గురు పిల్లలకు తల్లి
  • సుదీర్ఘ జాప్యంపై అలహాబాద్ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు
  • నిందితులిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘనే అని స్పష్టీకరణ
దేశంలోని న్యాయ వ్యవస్థ కేవలం వాయిదాల పర్వంగా, సినీ డైలాగ్ 'తారీఖ్ పే తారీఖ్' (వాయిదా మీద వాయిదా) లా మారిపోకూడదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దాదాపు పాతికేళ్లుగా సాగుతున్న ఒక కిడ్నాప్ కేసు విచారణలో జరిగిన విపరీతమైన ఆలస్యంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అనుమతిస్తూ హైకోర్టు లక్నో బెంచ్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

బహ్రైచ్ జిల్లా పాయగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2001లో అజయ్ కుమార్ అలియాస్ చింగీ, రామ్ చంద్రలపై ఒక కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలిగా పేర్కొన్న మహిళ.. నిందితుడైన అజయ్ కుమార్‌తో తన ఇష్టంతోనే వెళ్ళిందని, ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకుని ప్రస్తుతం భార్యాభర్తలుగా జీవిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అంతేకాదు, వీరికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ వాస్తవాలను ప్రభుత్వ లాయర్ సైతం గట్టిగా ఖండించలేకపోయారు.

ఈ కేసును విచారించిన జస్టిస్ రాజీవ్ భారతి.. కింది కోర్టు (ట్రయల్ కోర్టు) తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రెండు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం ఒక క్రిమినల్ కేసును ఇలాగే పెండింగ్‌లో ఉంచడం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు లభించే 'వేగవంతమైన, నిష్పక్షపాత విచారణ' హక్కుకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడం వల్ల క్రిమినల్ చర్యలు కేవలం ఒక ఫార్మాలిటీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాన్ని నిరవధికంగా వాయిదా వేయలేమని కోర్టు తేల్చి చెప్పింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న అజయ్ కుమార్, రామ్‌చంద్రలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాల వ్యవధిలో వారు ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని, నిర్దేశిత నిబంధనల ప్రకారం వారిని బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, బెయిల్ ఇచ్చే క్రమంలో తాము చేసిన వ్యాఖ్యలు ఈ కేసు తుది తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
Advertisement
Allahabad High Court
Tareekh Pe Tareekh
Article 21 Indian Constitution
Speedy trial right
Ajay Kumar kidnapping case
Lucknow Bench

More Telugu News