'బంగారం తీసుకుని మమ్మల్ని వదిలేయండి: హైవేపై భార్య వేడుకున్నా ఆగని దాష్టీకం

Take the gold and leave us Wife pleads but brutality continues on highway
  • బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కుటుంబంపై దాడి
  • చిన్న ప్రమాదం తర్వాత వెంబడించి దాడి చేసిన దుండగులు
  • బంగారం ఆఫర్ చేసిన ఆగని దాష్టీకం
  • డాష్‌క్యామ్ వీడియో ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటకలోని అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఒకటైన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పసిబిడ్డలతో ప్రయాణిస్తున్న ఒక కుటుంబాన్ని వెంబడించి, దుండగులు వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, పోలీసులు స్పందించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సాగర్ కుమార్ (37), ఆదివారం రాత్రి తన కుటుంబంతో కలిసి మైసూరు నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరారు. ఆయనతో పాటు భార్య, తల్లి, ఇద్దరు పిల్లలు (వారిలో ఒకరు 10 నెలల పసికందు) ఉన్నారు. శ్రీరంగపట్నం టోల్ ప్లాజా వద్ద వీరి కారు, మరో మారుతి స్విఫ్ట్ కారును స్వల్పంగా ఢీకొట్టింది. ఆ సమయంలో గొడవ సద్దుమణిగినట్లు కనిపించినా, స్విఫ్ట్ కారులోని వ్యక్తులు సాగర్ వాహనాన్ని వెంబడించారు. మండ్య జిల్లాలోని మద్దూరు సమీపంలో తమ వాహనాలతో వారని అడ్డగించి దాడికి దిగారు.

వారి వెనుక వస్తున్న మరో వాహనంలోని డాష్‌క్యామ్‌లో ఈ దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితులు సాగర్‌ను కారులోంచి బయటకు లాగి విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. తన భర్తను రక్షించేందుకు కారు దిగిన సాగర్ భార్య, పసిబిడ్డ ఉన్నాడని, కావాలంటే తన ఒంటిపై ఉన్న బంగారం తీసుకెళ్లాలని, తమను వదిలేయాలని వేడుకుంది. అయినప్పటికీ దుండగులు కనికరించకుండా దాడిని కొనసాగించారు. చివరకు అటుగా వెళ్తున్న ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సోమవారం సాగర్ అందించిన ఫిర్యాదు మేరకు మద్దూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్లు సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితుడు సాగర్ మాట్లాడుతూ, వీడియో ఆధారం ఉండటం వల్లే తనకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ రహదారులపై మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
Advertisement
Sagar Kumar
Bengaluru Mysuru Expressway
Karnataka road rage
Maddur police arrest
BMRCL assistant manager

More Telugu News