తెలంగాణలో రైతుల భూములపై భారీ కుట్ర జరుగుతోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar alleges massive conspiracy against farmers lands in Telangana
  • రైతుల భూ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న ప్రవీణ్ కుమార్
  • కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా పొలాలకు అందకుండా చేస్తున్నారని మండిపాటు
  • భూభారతి పోర్టల్ ద్వారా అక్రమ భూమి బదిలీలు జరుపుతున్నారని ఆరోపణ
తెలంగాణలో రైతులు, భూమి యజమానుల ఆస్తులపై భారీ కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా, భూమి హక్కుల పరంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నా కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేయకుండా రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్నారని... మరోవైపు, భూభారతి పోర్టల్ ద్వారా అక్రమ భూమి బదిలీలు జరుపుతున్నారని ఆరోపించారు. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పోర్టల్‌లో దాదాపు 22 వేల భూ బదిలీలు అక్రమంగా జరిగాయని, రైతులకు తెలియకుండానే వారి భూములు ఇతరులకు మార్చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నిషేధిత జాబితా భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను కూడా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి తమ ఇష్టానికి బదలాయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ బాగా పని చేస్తుండగా, కాంగ్రెస్ వచ్చాక భూమాఫియా రాజ్యం మొదలైందని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూకబ్జాలు పెరిగాయని, రైతుల ఆస్తులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Advertisement
RS Praveen Kumar
Telangana Land Conspiracy
Bhu Bharati Portal
Ponguleti Srinivasa Reddy
Telangana Farmers News
Dharani Portal

More Telugu News