ఒమన్ తీరంలో ట్యాంకర్పై క్షిపణి దాడి.... ముగ్గురు సిబ్బంది గల్లంతు
- ఒమన్ తీరంలో కెమికల్ ట్యాంకర్పై క్షిపణి దాడి
- ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు
- నౌకలో ఉన్న 28 మందిలో 24 మంది భారతీయులు
- పరిస్థితిని పర్యవేక్షిస్తున్న భారత విదేశాంగ శాఖ
'సెట్టెబెల్లో' అనే ఈ నౌకపై దాడి జరిగిన వెంటనే, దాని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ ధ్రువీకరించింది. సమాచారం అందిన వెంటనే ఒమన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 24 మంది భారతీయులు ఉన్నారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నామని వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇరాన్కు మద్దతిస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేపడుతున్న సైనిక చర్యల నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయ భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 8న కూడా ఇదే తరహాలో "మారివెక్స్" అనే ట్యాంకర్పై దాడి జరగ్గా, అందులోని 24 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ అధికారులు సురక్షితంగా రక్షించిన విషయం విదితమే. తాజా ఘటన నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత నావికుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.