గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!

Somu Veerraju commends Deputy CM Pawan Kalyan for Godavari pollution control
  • గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు
  • పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య
  • ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం

గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. నది ప్రక్షాళన కోసం కేంద్రం ఏడాదికి రూ.400 కోట్ల చొప్పున నిధులు ప్రకటించిందని, అందులో ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్న ఆయన.. మునికూడలిలో ఘాట్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోందని తెలిపారు.


ఇదే సమయంలో, గోదావరి నది కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరును సోము వీర్రాజు అభినందించారు. నదిని కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు ఆంధ్ర పేపర్ మిల్లుతో పాటు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పవన్ ఆదేశించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో పేపర్ మిల్లు కాలుష్యంపై ఎవరు మాట్లాడినా బ్లాక్‌మెయిల్ చేస్తారనే వాదన ఉండేదని, కానీ ఒక డైనమిక్ లీడర్‌గా పవన్ కల్యాణ్ ఆ అడ్డంకులను అధిగమించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.


దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందిస్తున్న నరేంద్ర మోదీ పాలన స్ఫూర్తితోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రధాని మోదీ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Go Back to Shorts
Somu Veerraju
Pawan Kalyan
Godavari River Cleaning
Andhra Paper Mill
Central Government Funds
Godavari Pushkaralu

More Telugu News