రిజర్వేషన్లపై భగవత్ కీలక వ్యాఖ్యలు.. లబ్ధి పొందిన వారికి ప్రత్యేక సూచన

Mohan Bhagwat key remarks on reservations and suggestion to beneficiaries
  • అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగాలన్న భగవత్
  • రిజర్వేషన్లను అంబేడ్కర్ దృక్పథంలో చూడాలని సూచన
  • లబ్ధి పొందిన వారు కోటా వదులుకోవాలని పిలుపు
  • అలాంటి ఆలోచనను ప్రోత్సహించాలని వ్యాఖ్య
  • రిజర్వేషన్ల అమలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని హితవు
  • సామాజిక అసమానతలు తగ్గితే కోటా అవసరం తగ్గుతుందని వివరణ
రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే వాటి వల్ల ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన వారు స్వచ్ఛందంగా ఆ ప్రయోజనాలను వదులుకోవాలని సూచించారు.

ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు భగవత్ సమాధానాలు ఇచ్చారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఈ అంశాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దృక్పథంలో చూడాలని అన్నారు.

రిజర్వేషన్లు రాజకీయ కారణాలతో కాకుండా సామాజిక కారణాలతో అమల్లోకి వచ్చాయని భగవత్ చెప్పారు. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం వాటి అవసరం ఉంటుందని తెలిపారు. సంక్షేమ చర్యలు నిజాయతీగా అమలు చేసి సామాజిక అసమానతలు తొలగించిన రోజే రిజర్వేషన్ల అవసరం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే ఎదిగిన వారు తమ సమాజంలోని ఇంకా వెనుకబడిన వారికి అవకాశం కల్పించేలా కోటాను వదులుకోవాలనే ఆలోచనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాంటి ఆలోచన ఇప్పటికే కొందరిలో కనిపిస్తోందని చెప్పారు. అలాంటి భావనను ప్రోత్సహించాలని సూచించారు.

రిజర్వేషన్ల అమలును రాజకీయాలకు అతీతంగా చూడాలని భగవత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం వల్ల సమాజంలో విభేదాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. వాస్తవానికి సామాజిక ఐక్యత కోసం తీసుకొచ్చిన వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.

ఇటీవల పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై చర్చ మళ్లీ మొదలైన వేళ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Advertisement
Mohan Bhagwat
RSS Chief
Reservation System India
Social Equality
Caste Based Reservations
RSS News

More Telugu News