రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
- నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం
- ఎనిమిది మంది కార్మికుల దుర్మరణం
- ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను, అలాగే గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు.
ఈ ప్రమాదంపై జగన్ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆయన స్పందిస్తూ... బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని స్థానిక వైసీపీ నాయకులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ శ్రేణులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
నిన్న సాయంత్రం స్టీల్ప్లాంట్లో ఒక పెద్ద పేలుడు సంభవించింది. 150 టన్నుల లాడిల్ నుండి కరిగిన ఉక్కు ఒక్కసారిగా కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా... మరో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.