అమరావతి అంటే ఆ 29 గ్రామాలే కాదు.. విజయవాడ, గుంటూరుతో కలిపి చూడాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says Amaravati includes Vijayawada and Guntur not just 29 villages
  • రాజధాని పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా పనిచేయాలని సూచన
  • పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్ట్ సంస్థలకు ఆదేశం
  • ఆర్థిక సమస్యలు ఉండవని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
  • ఇకపై క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పనులను పర్యవేక్షిస్తానని వెల్లడి
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రెండు నగరాల్లోనూ మౌలిక వసతుల ప్రాజెక్టులను రాజధానికి అనుసంధానంగా అభివృద్ధి చేసినప్పుడే సమగ్ర రాజధాని రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. మంగళవారం సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై సీఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ పనులను 'స్పీడ్, క్వాలిటీ, డెలివరీ' లక్ష్యంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంత పెరిగినప్పటికీ, అది ఏమాత్రం సరిపోదని, మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నామని, కాబట్టి పనుల్లో ఎక్కడా జాప్యం జరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. రాజధాని నిర్మాణం వంటి గొప్ప అవకాశం దక్కినందుకు కాంట్రాక్టు సంస్థలు దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాజధానిలో రూ.50,999 కోట్ల విలువైన 95 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, నెలకు కనీసం 7.92 శాతం చొప్పున పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్ల వంటి కీలకమైన అంశాల్లో అన్ని ప్రభుత్వ శాఖలు, ఉన్నతాధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపుపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

రాజధాని నిర్మాణ పనుల పురోగతిని ఇకపై తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Amaravati Capital City
Vijayawada Guntur Development
CRDA Project Progress
Andhra Pradesh Capital Construction
Speed Quality Delivery

More Telugu News