'బిజినెస్ రిఫార్మర్' అవార్డు ఘనత మీదే.. ప్రభుత్వ యంత్రాంగానికి చంద్రబాబు ఆత్మీయ విందు

Chandrababu hosts dinner for govt officials
  • చంద్రబాబుకు ఇటీవల జాతీయస్థాయిలో బిజినెస్ రిఫార్మర్ అవార్డు నే
  • మంత్రులు, అధికారులకు సీఎం ఆత్మీయ విందు
  • మీరే అసలైన విజేతలు అంటూ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రశంసలు
  • జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం
  • సంస్కరణలు చంద్రబాబు డీఎన్ఏలోనే ఉన్నాయన్న మంత్రి పయ్యావుల
  • భవిష్యత్ లక్ష్యాలు, వ్యూహాలపై ఉన్నతాధికారులతో సీఎం కీలక సమావేశం
తనకు జాతీయ స్థాయిలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ పురస్కారం లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగానికి ఆత్మీయ విందు ఇచ్చారు. ‘డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్’ పేరుతో అమరావతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు. ఈ అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన మంత్రులు, అధికారులు, ఉద్యోగులే అసలైన విజేతలని సీఎం ఈ సందర్భంగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. సమావేశ ప్రాంగణానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు, అధికారులు చప్పట్లతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ విందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు, క్షేత్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ఈ పురస్కారం రావడానికి ‘టీమ్ ఏపీ’ సమష్టి కృషే కారణమని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని, ఈ విజయాన్ని అందరితో కలిసి పంచుకోవడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశానని తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సంస్కరణలు అనేవి ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎన్ఏలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, ఓపెన్ స్కై పాలసీ, టెలికాం, ఐటీ, డ్రిప్ ఇరిగేషన్, పీపీపీ వంటి ఎన్నో రంగాల్లో ఆయన ముందుచూపుతో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు.

విందు కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై విస్తృతంగా చర్చించారు. పరిపాలనలో మరింత వేగం పెంచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం.
Go Back to Shorts
Chandrababu
Business Reformer Of The Year
Award
Dinner
AP Govt
TDP
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News