మోదీ మెప్పు కోసం అబద్ధాలు చెప్పొద్దు.. చంద్రబాబు, పవన్ లకు ప్రకాశ్‌ రాజ్ కౌంటర్!

Prakash Raj Counters Pawan Kalyan Chandrababu on Modi Praise
  • మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏపీ నేతలు, నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు మధ్య మాటల యుద్ధం
  • విపక్షాల వల్లే బిల్లు ఆగిపోయిందన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • మోదీ మెప్పు కోసమే అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రకాశ్‌ రాజ్ విమర్శ
  • డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమంటూ ఆరోపణ
  • ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అంటూ పవన్‌కు ప్రకాశ్‌ రాజ్ సవాల్
మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్‌ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా బదులిచ్చారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని ఆయన హితవు పలికారు.

అంతకుముందు ఈ బిల్లు వీగిపోవడానికి ప్రతిపక్షాలే కారణమని పవన్ కల్యాణ్, చంద్రబాబు విమర్శించారు. ఇది దేశ పురోగతిని అడ్డుకోవడమేనని, చారిత్రక అవకాశాన్ని విపక్షాలు చేజార్చాయని పవన్ మండిపడ్డారు. ప్రతిపక్షాల చర్య కోట్లాది మహిళలకు ద్రోహం చేయడమేనని, ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ప్రకాశ్‌ రాజ్ స్పందిస్తూ ... మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, దాన్ని ఎప్పుడైనా అమలు చేయవచ్చని గుర్తుచేశారు. కానీ, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెడుతోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. "ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని డిప్యూటీ సీఎంను చేశారు.. వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. ఈ అంశంపై మీతో చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా?" అంటూ పవన్ కల్యాణ్‌కు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.

అలాగే, సీఎం చంద్రబాబును ఉద్దేశించి కూడా "మీరు అబద్ధం చెబుతున్నారని దేశం గుర్తుంచుకుంటుంది సార్.. జస్ట్ ఆస్కింగ్" అంటూ ప్రకాశ్‌ రాజ్ తనదైన శైలిలో చురక అంటించారు. ప్రస్తుతం ఈ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం జాతీయ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Prakash Raj
Chandrababu Naidu
Pawan Kalyan
AP Politics
Women Reservation Bill
Delimitation Bill
Modi
BJP
Andhra Pradesh
Political Controversy

More Telugu News