Sam Pitroda: 'పాక్ లో సొంతింటి ఫీలింగ్' వ్యాఖ్యలపై దుమారం... శామ్ పిట్రోడా వివరణ

Sam Pitroda Clarifies Pakistan Remarks After Controversy
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ లో ఉంటే సొంతింట్లో ఉన్న ఫీలింగ్ కలిగిందంటూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన ఉద్దేశాన్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఉగ్రవాదం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల మనం ఎదుర్కొంటున్న సవాళ్లను, బాధలను విస్మరించడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.

"భారత ఉపఖండంలోని ఉమ్మడి చరిత్ర, ప్రజల మధ్య ఉన్న సంబంధాలను నొక్కి చెప్పడానికే నేను అలా మాట్లాడాను. నా మాటల వల్ల గందరగోళం లేదా బాధ కలిగి ఉంటే క్షమించాలి. ఎవరి బాధను తక్కువ చేయాలనేది నా లక్ష్యం కాదు. దేశ ప్రతిష్ఠ, ఇతర దేశాలు మనల్ని చూసే విధానంపై నిజాయితీతో కూడిన చర్చను ప్రోత్సహించడమే నా ఉద్దేశం" అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఇవే..!
ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామ్ పిట్రోడా భారత విదేశాంగ విధానంపై మాట్లాడారు. మన విదేశాంగ విధానం ముందుగా పొరుగు దేశాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. "నేను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వెళ్లాను. అక్కడ నాకు సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించింది కానీ, ఓ విదేశంలో ఉన్న భావన కలగలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ తీవ్ర విమర్శలు
పిట్రోడా వ్యాఖ్యల్లో పాకిస్థాన్ ప్రస్తావన ఉండటంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నాయకత్వం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. "రాహుల్ గాంధీకి అత్యంత ఇష్టుడైన శ్యామ్ పిట్రోడాకు పాకిస్థాన్ లో సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించిందట. అందుకే 26/11 ముంబై దాడుల తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం పాక్ పై కఠిన చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పాకిస్థాన్ కు అత్యంత ఇష్టమైన పార్టీ" అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పిట్రోడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
Go Back to Shorts
Sam Pitroda
Pakistan
Shyam Pitroda
Indian Foreign Policy
Congress
BJP criticism
India
Controversial remarks
UPA government

More Telugu News