ఇందిరమ్మ ఇళ్లుకు దరఖాస్తు చేసుకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయా?: హౌసింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ కీలక ప్రకటన

VP Gautham clarifies rumors on Indiramma Indlu and welfare schemes
  • ఇందిరమ్మ ఇళ్ల పథకంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి
  • ఈ పథకానికి దరఖాస్తు చేస్తే ఇతర సంక్షేమ పథకాలు ఆగవని స్పష్టత
  • తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల ఇతర సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

సొంత స్థలం లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి ప్రచారాలను పట్టించుకోవద్దని సూచించారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అర్హులైన పట్టణ పేదల కోసం ప్రభుత్వం ఇటీవలే 'ఇందిరమ్మ ఇళ్లు (క్యూర్)' పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధులలో 7,680 బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో లబ్ధిదారులు సుమారు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు స్థలాన్ని ఉచితంగా అందిస్తుంది. పదేళ్లుగా స్థానికంగా నివాసం ఉండటం, వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకపోవడం, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇల్లు లేదా ఫ్లాట్ లేకపోవడం వంటివి ఈ పథకానికి ప్రధాన అర్హతలుగా నిర్ణయించారు.
Advertisement
VP Gautham
Indiramma Indlu Scheme
Telangana Housing Board
CURE Housing Scheme
Indiramma Houses Application

More Telugu News