Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిది: నారా లోకేష్

Nara Lokesh Government Responsibility to Safely Return Stranded Telugu People From Nepal
  • ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాం
  • నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో చిక్కుకున్న 217 మంది తెలుగువారు 
  • రేపు మధ్యాహ్నం ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆంధ్రుల తరలింపు
  • సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయం నాలుగో బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "ఉదయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేపాల్‌లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాం. అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అని, తిరిగి వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు గారు మాకు చెప్పారు. ఉదయం నుంచి నేను ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాం. గౌరవ హోం మంత్రి అనిత, మంత్రి దుర్గేష్ అనంతపురం సభ నుంచి నేరుగా అమరావతికి వచ్చారు. మేం ముగ్గురం పరిస్థితిని సమీక్షించాం. ఏపీ భవన్‌లో ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటుచేసి ఒక సింగిల్ నెంబర్ ద్వారా తెలుగువారిని సంప్రదించాం. ఎవరైతే ఆ నంబర్‌కు ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించాం. వారికి అందుతున్న ఆహారం, నీరు, విద్యుత్ సదుపాయాలపై రియల్ టైంలో ఆరా తీశాం.  

నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో చిక్కుకున్న 217 మంది తెలుగువారు

"ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ ద్వారా టీడీపీ ఎంపీ సానా సతీష్, ఏపీ భవన్ అధికారి అర్జే శ్రీకాంత్ రియల్ టైంలో మానిటరింగ్ చేశారు. ఇప్పటికే మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 217 మంది ఆంధ్రులు 12 ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారు. వీరంతా హోటళ్లలో కాని, వేరే పట్టణాల్లో కానీ ఉన్నారు. ఇందులో సుమారు 173 మంది ఖాట్మండూలో, 22 మంది హిటోడాలో, 10 మంది పోక్రాలో, 12 మంది సిమికోట్‌లో ఉన్నారు. ఇది మేము టైం టు టైం మానిటరింగ్ చేస్తున్నాం. ఇందులో సుమారుగా 118 మంది మహిళలు, 98 మంది మగవారు ఉన్నారు. అటు ఏపీ భవన్, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టైం టూ టైం ఇటు ఎంబీసీతో, ఇతర అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేశాం" అని లోకేశ్ వెల్లడించారు.

రేపు మధ్యాహ్నం ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం ద్వారా తరలింపు

ప్రధానంగా రేపు ఖాట్మండు నుంచి ఆంధ్రావారిని తీసుకువచ్చేందుకు రేపు మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక విమానం ఖాట్మండులో దిగి, అక్కడి నుంచి ఆంధ్రులు అందరినీ మొదటి హాల్ట్ విశాఖ, రెండో హాల్ట్ కడపకు తీసుకు వస్తుందని అన్నారు. ఖాట్మండుతో పాటు సిమికోట్‌లో ఉన్న 12 మందిని ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్ పోర్ట్‌కు రేపు ఉదయం తరలిస్తామని వెల్లడించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా వారు లక్నోకు వెళ్లి, అక్కడి నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారని తెలిపారు. పోక్రాలో ఉన్న 10 మందిని రేపు ఉదయం ప్రత్యేక విమానం ద్వారా ఖాట్మండుకి తీసుకువచ్చి, అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విమానం ద్వారా తిరిగి రాష్ట్రానికి వస్తారని మంత్రి తెలిపారు. హిటోడాలో ఉన్న మరో 22 మంది రోడ్డు మార్గం ద్వారా ఈ రోజు రాత్రే బీహార్ సరిహద్దులోని రాక్సాల్‌కు చేరుకున్నారు. వారికి కావాల్సిన ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లు కూడా చేశాం. వీరి సంరక్షణను ఏపీ భవన్ చూసుకుంటోందని అన్నారు.

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిది

"రేపు ఉదయం పది గంటలకు మేం తిరిగి సమావేశం అవుతాం. రేపు మొత్తం మానిటరింగ్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చేంత వరకు పనిచేస్తాం. కేవలం విశాఖ, కడపకే కాదు.. ప్రభుత్వం అందరినీ వారి వారి నివాసాలకు చేర్చుతాం. విమానాశ్రయంలో కూడా వారికి కావాల్సిన వాహనాలు ఏర్పాటుచేసి నేరుగా వారిని ఇంటివద్దకే చేర్చుతాం. ఈ రోజు ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుని నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రులను తిరిగి తీసుకురావడం జరిగింది. మేం అందరం వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటుచేసుకున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. ప్రతి రెండు గంటలకు ఒకసారి ముఖ్యమంత్రి గారికి పరిస్థితిని వివరించాం. రేపు సాయంత్రం నాటికి అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది" అని వివరించారు.

నేపాల్‌లో చిక్కుకున్న వారు తొలుత కొంత ఆందోళనతో ఉన్నారని, మేం మాట్లాడిన తర్వాత కుదురుకున్నారని మంత్రి వెల్లడించారు. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులను వారంతా వివరించారని, ఏపీ నుంచి మేం 12 గ్రూప్‌లతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే మమల్ని సంప్రదించాలని సూచన చేశామని తెలిపారు.

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో కూడా దాదాపు 12 సార్లు మాట్లాడామని తెలిపారు. మంత్రివర్గ భేటీకి ముందు కూడా సంప్రదించినట్లు వెల్లడించారు. భారతీయులను తీసుకువచ్చే బాధ్యత రామ్మోహన్ నాయుడు తీసుకున్నారని అన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిలో ప్రధానంగా విశాఖ నుంచి 42 మంది, విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది ఉన్నారన్నారు.
Nara Lokesh
Nepal
Telugu people
stranded
repatriation
Andhra Pradesh
Khatmandu
rescue operation

More Telugu News