Manchu Vishnu: పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేక షో... తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపుపై మంచు విష్ణు

Manchu Vishnu Special Show for Pawan Kalyan on Kannappa Movie
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దర్శకుడు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఇలాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించడం సంతోషంగా ఉందని, చిత్ర బృందం మొత్తం అంకితభావంతో పని చేసిందని తెలిపారు.

పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేక ప్రదర్శన

సినిమా విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా కలిసి, ఆయనకు కన్నప్ప సినిమా చూపిస్తానని విష్ణు తెలిపారు. "మనకు తెలిసిన పవన్‌ కల్యాణ్‌ వేరు. ఇప్పుడు ఆయనపై రాష్ట్ర బాధ్యత ఉంది. నటుడిగా ఆయన నాకు సీనియర్‌. ఆయన ప్రశంసల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.

టిక్కెట్ ధరల పెంపుపై స్పష్టత

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెంచినప్పటికీ, తెలంగాణలో మాత్రం ధరలు పెంచడం లేదని విష్ణు స్పష్టం చేశారు. "ఎప్పుడైతే థియేటర్లలో పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్‌ ధరలు తగ్గుతాయో, అప్పుడే మల్టీప్లెక్సుల్లో ధరల పెంపు గురించి ఆలోచిస్తాను. ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా కాబట్టి, ధరలు పెంచి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని కేంద్రాల్లో మాత్రమే రూ.50 పెంచాలని విజ్ఞప్తి చేశాం" అని ఆయన అన్నారు.

సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ ఎందుకు హాజరుకాలేదన్న ప్రశ్నకు, "ప్రభాస్‌ చాలా మొహమాటస్తుడు. ఈ చిత్రంలో భాగమైనందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన మనస్తత్వం నాకు తెలుసు, కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. సినిమాకు ఒక వీడియో బైట్‌ పంపిస్తానని చెప్పారు, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆయన వల్లే ఈ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో విడుదల చేయగలుగుతున్నాం. ఇందులో ప్రభాస్ పాత్ర సుమారు 40 నిమిషాల పాటు ఉంటుంది" అని విష్ణు తెలిపారు. కేరళలో మోహన్‌లాల్‌ సహకారంతో దాదాపు 300 థియేటర్లలో సినిమా విడుదలవుతోందని, ఆయన పాత్ర కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని అన్నారు.

కుటుంబ సభ్యుల నటన, బడ్జెట్ ప్రస్తావన

ఈ చిత్రంలో తన పిల్లలు కూడా నటించారని, వారిని నటీనటులుగా చూడాలనుకుంటున్నానని విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. తన భార్యను కూడా నటించమని అడిగానని తెలిపారు. ఈ సినిమా విషయంలో తన తండ్రి మోహన్ బాబు ఇచ్చిన ధైర్యంతోనే ముందడుగు వేశామని, ఆయన స్క్రిప్ట్‌ను నమ్మి భారీగా ఖర్చుపెట్టారని అన్నారు. బడ్జెట్ గురించి ఇంటర్వ్యూలో బలవంతంగా చెప్పించారని, ఆ తర్వాత నిన్న తమ కార్యాలయంలో జీఎస్టీ దాడులు జరిగాయని నవ్వుతూ ప్రస్తావించారు.

ఓటీటీ విడుదల

సినిమా విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీలో వస్తుందని, అందుకే ప్రస్తుతానికి ఓటీటీ డీల్‌ను పక్కనపెట్టామని విష్ణు తెలిపారు. "విడుదల ఒత్తిడి లేదు. ప్రేక్షకులకు ఉత్తమ సినిమా అందించాలనేదే నా లక్ష్యం" అని ఆయన అన్నారు. ఈ సినిమా ద్వారా భగవంతుడికి, భక్తుడికి మధ్య ఎలాంటి మధ్యవర్తులు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు అవసరం లేదని, మనసారా ప్రార్థిస్తే దేవుడు మనకు దగ్గరవుతాడనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు విష్ణు పేర్కొన్నారు.
Go Back to Shorts
Manchu Vishnu
Kannappa Movie
Pawan Kalyan
Prabhas
Mohanlal
Telugu Cinema

More Telugu News