Revanth Reddy: రేపు విజయవాడకు వెళుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy to Visit Vijayawada Tomorrow

  • టీడీపీ నేత దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు వెళ్లనున్న రేవంత్
  • గత వారం రేవంత్ నివాసానికి వెళ్లి పెళ్లికి ఆహ్వానించిన దేవినేని ఉమా
  • వివాహ వేడుకలో చంద్రబాబును రేవంత్ కలిసే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకు వెళ్లనున్నారు. 

రేపు ఉదయం 9.15 గంటలకు రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగే వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం విజయవాడ నుంచి తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు.

గత వారం దేవినేని ఉమా హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలిసి, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని ఆయన సీఎంను ఆహ్వానించారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు దేవినేని ఉమాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పార్టీలు మారినప్పటికీ వారి మధ్య స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మిత్రుడి ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ వివాహానికి హాజరవుతున్నారు.

మరోవైపు, ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరవనున్నారు. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉంది. 

Revanth Reddy
Telangana CM
Vijayawada
Devineni Uma
TDP
Andhra Pradesh CM
Chandrababu Naidu
Wedding
Political Event
Vijayawada visit
  • Loading...

More Telugu News