ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు?: రోజా
- తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ కారణమన్న రోజా
- సమాజ మెప్పు కోసం ఈ విషయాన్ని పవన్ అంగీకరించారని వ్యాఖ్య
- బాధ్యులపై చర్యలను ఎందుకు కోరడం లేదని ప్రశ్న
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి పూర్తిగా విఫలమయ్యారనే విషయం పవన్ మాటలతో స్పష్టమయిందని రోజా అన్నారు. కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలకమండలి వైఫల్యం కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అందుకు కారణమైన టీటీడీ ఛైర్మన్, ఈఓ, అదనపు ఈఓలపై చర్యలు తీసుకోవాలని పవన్ ఎందుకు అడగరు? అని ప్రశ్నించారు.
సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని తాను చెప్పడం ద్వారా ప్రజలు మెప్పు పొందటం, చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం... ఇదేనా మీ సనాతన ధర్మం? అని పవన్ ను రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే అర్థం అవుతుంది మీ వ్యూహం ఏమిటో అని వ్యాఖ్యానించారు.