యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ ఛార్జీ.. కేంద్రం పరిశీలనలో కీలక ప్రతిపాదన

UPI payments MDR charges Central Government considering key proposal
  • అధిక విలువ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ను పరిశీలిస్తున్న కేంద్రం
  • ప్రభుత్వ ప్రోత్సాహకాలను దశలవారీగా తగ్గించే ప్రతిపాదన
  • యూపీఐ వ్యవస్థ నిర్వహణ ఖర్చు రూ.20,700 కోట్లుగా పరిశ్రమ అంచనా
  • ప్రస్తుతం రూ.2,000 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్రం
  • 2020 నుంచి అమల్లో లేని యూపీఐపై ఎండీఆర్‌
యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)ను మళ్లీ అమలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే అన్ని లావాదేవీలపై కాకుండా అధిక విలువ కలిగిన కొన్ని యూపీఐ చెల్లింపులు లేదా నిర్దిష్ట వ్యాపారులకే ఎండీఆర్‌ విధించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహకాలను దశలవారీగా తగ్గించే ‘టియర్‌డ్‌ ఇన్సెంటివ్‌’ విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కమిటీకి తెలిపింది.

యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలం స్థిరంగా కొనసాగించడంతో పాటు ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు ఈ రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. అధిక పరిమితి దాటిన లావాదేవీలు లేదా కొన్ని వర్గాల వ్యాపారులకు ఎండీఆర్‌ పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ లేదు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 2020 జనవరి నుంచి కేంద్రం ఈ ఛార్జీని రద్దు చేసింది. అంతకుముందు వ్యాపారుల యూపీఐ లావాదేవీలపై గరిష్ఠంగా 0.30 శాతం ఎండీఆర్‌ ఉండేది.

ప్రభుత్వంపై పెరుగుతున్న భారం
యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.2,000 కోట్లు కేటాయించింది. అయితే పరిశ్రమ అంచనా ప్రకారం యూపీఐ వ్యవస్థ నిర్వహణకు రూ.20,700 కోట్ల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహకం పరిశ్రమ వాస్తవ ఖర్చులో కేవలం 11 శాతానికే సరిపోతుందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.

పరిహారం తగినంతగా లేకపోతే సైబర్‌ సెక్యూరిటీ, మోసాల నిరోధం, చెల్లింపు నెట్‌వర్క్‌ మౌలిక వసతులపై కీలక పెట్టుబడులపై ప్రభావం పడొచ్చని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

నెలకు 150 బిలియన్‌ లావాదేవీలు?
యూపీఐ వినియోగం మరింత భారీగా పెరగనున్నట్లు కమిటీ తెలిపింది. నెలకు 150 బిలియన్‌ లావాదేవీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరో 60 కోట్ల మంది కొత్త వినియోగదారులు యూపీఐలో చేరొచ్చని అంచనా వేసింది.

ఇటీవల పార్లమెంటు ఆమోదించిన పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు-2026తో కొన్ని ఎలక్ట్రానిక్‌ చెల్లింపు విధానాలకు ఛార్జీల నుంచి చట్టపరమైన రక్షణ కొనసాగించేలా ప్రభుత్వం మార్గం ఏర్పడింది. అయితే యూపీఐపై ఎండీఆర్‌ విధించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతించలేదు.
Advertisement
UPI
MDR charges
Merchant Discount Rate
Digital payments India
Central Government
UPI transaction fees

More Telugu News