పంచదార్ల అక్రమ తవ్వకాలపై వైసీపీ ఫైట్.. పార్లమెంటులో ప్రస్తావనకు సిద్ధం

YSRCP fight against Panchadarla illegal mining to be raised in Parliament
  • ఢిల్లీకి చేరిన పంచదార్ల అక్రమ మైనింగ్ వ్యవహారం
  • కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, షెకావత్‌లకు వైసీపీ నేతల ఫిర్యాదు
  • పది రోజుల్లో కేంద్ర బృందంతో విచారణ జరిపిస్తామని కేంద్రం హామీ
  • ఎంపీ సీఎం రమేశ్‌పై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్
  • జీవో రాకుంటే పార్లమెంటులో అంశాన్ని లేవనెత్తుతామని హెచ్చరిక
అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని వైసీపీ జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పంచదార్ల పవిత్ర కొండను శాశ్వత 'నో-మైనింగ్ జోన్'‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు (జీవో) జారీ చేయాలని, లేని పక్షంలో ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని పార్టీ నేతలు తీవ్రంగా హెచ్చరించారు.

వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసింది. కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రులు.. పది రోజుల్లోగా ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపి, వారు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తనూజారాణి మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పాత్రపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి దాదాపు రూ.250 కోట్ల జరిమానా విధించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు.

అధికారిక విచారణల్లోనే మైనింగ్, బ్లాస్టింగ్ ప్రకంపనల వల్ల అక్కడి పవిత్ర జలధారలు దెబ్బతింటున్నట్లు స్పష్టమైందని, అనుమతించిన ప్రణాళికకు మించి దాదాపు 2 లక్షల టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారని వైసీపీ నేతలు ఆరోపించారు. పంచదార్లలో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ఢిల్లీ గడప తొక్కిందని, ఆ ప్రాంతాన్ని 'నో-మైనింగ్ జోన్'‌గా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.                                
Advertisement
YSRCP
Panchadarla Illegal Mining
CM Ramesh
Anakapalli District
Gudivada Amarnath
Union Minister Kishan Reddy

More Telugu News