సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే... ఎల్లుండి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు

Eknath Shinde likely to take oath as deputy Chief Minister on Dec 5
  • ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం అంటూ జాతీయ మీడియాలో వార్తలు
  • డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేస్తారని కథనాలు
  • రేపు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న బీజేపీ ఎమ్మెల్యేలు
దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్‌నాథ్ షిండే ఉపముఖ్యమంత్రిగా మహాయుతి కూటమి ఎల్లుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీఎం పదవి, మంత్రివర్గం ఏర్పాటుపై మహాయుతి కూటమిలో పది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఫలితాలు వచ్చి పది రోజులు దాటింది. అయితే వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

మహాయుతి కూటమిలో చర్చలు కొలిక్కి వచ్చాయని, బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏక్‌నాథ్ షిండే ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నట్టు కథనాలు వచ్చాయి.

డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉంటారని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. ఏక్‌నాథ్ షిండేతో పాటు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. బుధవారం నాడు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు.

ఇదిలా ఉండగా, ఏక్‌నాథ్ షిండే కొన్నిరోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం నాడు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. షిండే థానేలోని ఓ ఆసుపత్రిలో చెకప్ చేయించుకున్నారు.
Go Back to Shorts
Eknath Shinde
Devendra Fadnavis
BJP
Maharashtra

More Telugu News