నితిన్ గడ్కరీపై డీప్ఫేక్ వీడియోలను తొలగించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు
- ఈ20 ఇంధనం వ్యవహారంలో గడ్కరీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
- మెటా, గూగుల్, ఎక్స్ సంస్థలకు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- అభ్యంతరకర పోస్టులను స్వచ్ఛందంగా తొలగించే సాంకేతిక యంత్రాంగం ఉందా అని ప్రశ్న
ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనం (ఈ20) వివాదంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గడ్కరీకి వ్యతిరేకంగా ప్రచారంలో ఉన్న ఏఐ డీప్ఫేక్ వీడియోలు, నిందాపూర్వక పోస్టులను తక్షణమే తొలగించాలని మెటా, గూగుల్, ఎక్స్ వంటి దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కంటెంట్ను 'అత్యంత నీచమైనది, నిందాపూర్వకమైనది' అని అభివర్ణించిన ధర్మాసనం... ఇటువంటి పోస్టులకు బహిరంగ ప్లాట్ఫామ్లలో స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రతిసారీ బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, ఇలాంటి పరువు నష్టం కలిగించే అభ్యంతరకర పోస్టులను స్వచ్ఛందంగా గుర్తించి తొలగించేలా ఏదైనా సాంకేతిక యంత్రాంగం ఉందా? అని సోషల్ మీడియా సంస్థలను నిలదీసింది.
ఈ20 పెట్రోల్ విధానం ద్వారా తన కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందుతోందంటూ దొంగ సంతకాలు, ఫోర్జరీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల తన పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని పేర్కొంటూ గడ్కరీ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించినందుకు గాను రూ. 11 కోట్లను నష్టపరిహారంగా కోరారు. ఇథనాల్ ఇంధన విధానాన్ని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మాత్రమే పర్యవేక్షిస్తుందని... దానితో తన మంత్రిత్వ శాఖకు గానీ, వ్యక్తిగతంగా తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.