ఇంటర్ కాలేజీల ఫోర్జరీ కేసు.. ఫైర్ డీజీ సంతకాలు కూడా ఫోర్జరీ!
- హైడ్రా కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసిన 8 కాలేజీలు
- మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను కూడా ఫోర్జరీ చేసిన కాలేజీలు
- ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న నాగిరెడ్డి
హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ కళాశాలల నకిలీ ఎన్ఓసీల స్కామ్లో మరో కొత్త నిజం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ బోర్డు అఫిలియేషన్ పొందేందుకు 8 కాలేజీలు ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ సంతకాలను ఫోర్జరీ చేసిన ఉదంతం కలకలం రేపుతుండగానే... మరోవైపు, సరిగ్గా అదే బాటలో మరికొన్ని కాలేజీలు అగ్నిమాపక శాఖ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న నాగిరెడ్డి స్థానంలో వేరే అధికారులు బాధ్యతలు (ఫైర్ డీజీ) చేపట్టినప్పటికీ... సదరు కాలేజీల యాజమాన్యాలు పాత డీజీ నాగిరెడ్డి పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీ పత్రాలను సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించాయి. నాగిరెడ్డి అగ్నిమాపక శాఖలో లేకపోయినా ఆయన సంతకాలతో సర్టిఫికెట్లు రావడంపై అనుమానం వచ్చిన అధికారులు అసలు విషయాన్ని బయటకు తీశారు. దీనిపై విచారణ జరపగా, నాగిరెడ్డి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి దొంగ ఎన్ఓసీలు తయారు చేసిన వ్యవహారం బయటపడింది. మొత్తం 8 ప్రైవేటు జూనియర్ కాలేజీలు నాగిరెడ్డి పేరుతో ఈ నకిలీ ఎన్ఓసీల అక్రమానికి పాల్పడినట్లు అధికారులు తేల్చారు.