శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి విడుదల.. ప్రాధాన్యత తాగునీటికేనన్న మంత్రి నిమ్మల

Nimmala Rama Naidu releases Srisailam water to Rayalaseema with focus on drinking water
  • శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు ఉందన్న నిమ్మల
  • రాబోయే 10 రోజుల్లో మరో 100 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని వెల్లడి
  • చెన్నై తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు అవసరమవుతాయన్న మంత్రి

రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాలను తీర్చేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను అధిగమించేందుకు రాబోయే 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాలకే భద్రపరచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 


ప్రస్తుతం శ్రీశైలంలో 119 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న 63 శాతం వాటాలో మొదటి ప్రాధాన్యత ప్రజల తాగునీటికే ఇస్తున్నామని స్పష్టం చేశారు.


హంద్రీనీవా పరిధిలోని జలాశయాల తాగునీటికి 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీల నీటిని రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో తాగునీటి కోసమై 32 టీఎంసీలు అవసరమవుతాయని చెప్పారు. 


వర్షాలు, ఇన్ ఫ్లో పరిస్థితులను ప్రతి వారం సమీక్షిస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతామన్నారు. జిల్లాల కలెక్టర్లతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ నీటి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.

Advertisement
Nimmala Rama Naidu
Srisailam Reservoir water release
Rayalaseema drinking water supply
Handri Neeva project updates
Andhra Pradesh Water Resources
Pothireddypadu reservoir water

More Telugu News