పవన్ కల్యాణ్ ను డిక్లరేషన్ అడుగుతారా.. టీటీడీకి వైసీపీ నేత ప్రశ్న
- తన కుటుంబం బాప్టిజం తీసుకుందని పవన్ గతంలో చెప్పారన్న నారాయణ స్వామి
- ఐదేళ్లు సీఎం హోదాలో శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారన్న వైసీపీ నేత
- అప్పుడు ఎలాంటి డిక్లరేషన్ అడగలేదని గుర్తుచేసిన మాజీ డిప్యూటీ సీఎం
- ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని నిలదీసిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్ల పాటు ప్రభుత్వం తరఫున శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని నారాయణస్వామి గుర్తుచేశారు. అప్పుడు జగన్ నుంచి టీటీడీ ఎలాంటి డిక్లరేషన్ అడగలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నప్పుడూ జగన్ ను డిక్లరేషన్ అడగలేదన్నారు. అప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని టీటీడీ అధికారులను నిలదీశారు. దీంతో తిరుమల లడ్డూ కల్తీ వివాదం మరో మలుపు తిరిగింది. తిరుమలకు వచ్చే హిందూయేతరులు తప్పనిసరిగా సమర్పించాల్సిన డిక్లరేషన్ చుట్టూ చర్చ జరుగుతోంది.
పవన్ పై తీవ్ర ఆరోపణలు..
పవన్ పై తాము నిందలు వేయడంలేదని నారాయణస్వామి వివరించారు. గతంలో పవన్ స్వయంగా చెప్పిన విషయాలనే తాము గుర్తుచేస్తున్నామని తెలిపారు. దేవుడు లేడని తన తండ్రి అనేవారంటూ పవన్ చాలాసార్లు చెప్పారన్నారు. తనకు కులం, మతం, పార్టీలు లేవని పవన్ చెప్పారన్నారు. హిందువులే రెచ్చగొట్టి గొడవలు చేస్తున్నారని కూడా పవన్ అన్నారని తెలిపారు. ప్రజాసేవ అంటే సినిమా కాదని, ఉదయం పూజలు చేసి సాయంత్రం షూటింగ్ కు వెళ్లడం సేవ కాదని నారాయణస్వామి అన్నారు.