Vellampalli Srinivasa Rao: జగన్ పై దాడి కేసులో బొండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: వెల్లంపల్లి

  • బొండా ఉమకు ఓటమి భయం పట్టుకుందన్న వెల్లంపల్లి
  • జగన్ పై ఉమ అనుచరులు దాడి చేశారని వ్యాఖ్య
  • బొండా ఉమకు డిపాజిట్ కూడా రాదన్న వెల్లంపల్లి
Bonda Uma has to pay for stone attack on Jagan says Vellampalli Srinivasa Rao

టీడీపీ నేత బొండా ఉమకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దొంగచాటుగా బొండా ఉమ ఎందుకు నామినేషన్ వేశారని... తప్పు చేశాడు కాబట్టే బొండా ఉమ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. బొండా ఉమ నామినేషన్ కార్యక్రమానికి ఆయన కొడుకు తప్ప మరెవరూ వచ్చిన దిక్కు లేదని అన్నారు. బొండా ఉమను అరెస్ట్ చేయబోతున్నారంటూ... ఆయనే మెజేస్ లు ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తోందని అన్నారు. 

జగన్ పై రాయి దాడి కేసులో బొండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక ప్రజలే లేరని... ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు ఉమ అని అన్నారు. జగన్ పై బొండా ఉమా అనుచరులు దాడి చేయడంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. జగన్ పై రాయి విసిరారని బొండా ఉమ ఒప్పుకున్నారని.. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు. 

నిన్న రాత్రి టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ రోడ్డుపై బైఠాయించారని వెల్లంపల్లి విమర్శించారు. పెద్ద నాటకం సృష్టించారని దుయ్యబట్టారు. బొండా ఉమకు డిపాజిట్ కూడా రాదని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

More Telugu News