Advertisement

ఇన్ఫోసిస్ తదుపరి సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్.. 2027 నుంచి బాధ్యతలు

Ashish Kumar Dash as next Infosys CEO duties from 2027
  • ఇన్ఫోసిస్ సీఈవో-డెజిగ్నేట్‌గా ఆశిష్ కుమార్ దాష్ నియామకం
  • 2027 ఏప్రిల్ 1 నుంచి సలీల్ పరేఖ్ స్థానంలో బాధ్యతలు
  • సంస్థలో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ అధికారి
  • కంపెనీ ఏఐ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశిష్ దాష్
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఆశిష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ స్థానంలో ఆయన 2027 ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారు.

గురువారం జరిగిన సమావేశంలో నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఆశిష్ దాస్ తక్షణమే సీఈవో డెజిగ్నేట్‌గా బాధ్యతలు చేపట్టి, నాయకత్వ మార్పు ప్రక్రియలో భాగస్వాములవుతారు. ఈ నియామకానికి వాటాదారుల మరియు చట్టపరమైన నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.

ఇన్ఫోసిస్‌లో దాదాపు మూడు దశాబ్దాలు అనుభవం ఉన్న ఆశిష్, సంస్థ చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరివర్తన ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ నియామకంపై ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ, కంపెనీ విలువలను కాపాడుతూనే, సమకాలీన అవసరాలకు అనుగుణంగా సాహసోపేతమైన మార్పులు తీసుకురాగల సమర్థవంతమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. బోర్డు తనపై ఉంచిన నమ్మకానికి ఆశిష్ దాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ ఈ పరిణామాన్ని స్వాగతించారు. నాయకత్వ బదిలీ ప్రక్రియ అత్యంత సజావుగా సాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో అర్హులైన నూతన ఉద్యోగులకు 9,836 రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లను (ఆర్‌ఎస్‌యూలు), ఇతర ఉద్యోగులకు సుమారు 4.78 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది.
Advertisement
Ashish Kumar Dash Infosys New CEO
Salil Parekh
Nandan Nilekani
Infosys Leadership Change

More Telugu News