Advertisement

ఆందోళనకారులతో మాట్లాడతాం.. మీకు వీలైనప్పుడే చర్చిద్దాం: కేంద్రమంత్రి

Jitendra Singh says government ready to talk with NEET protesters at their convenience
  • నీట్ ఆందోళనకారులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పిలుపు
  • జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనలు
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్
నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. నిరసనకారులకు అనువైన సమయంలో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని, శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకుందామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు, విద్యార్థులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం తరఫున ఇప్పటికే నాలుగు ప్రతిపాదనలను సిద్ధం చేశామని, తాను, మరో కేంద్రమంత్రి జేపీ నడ్డా చర్చలకు అందుబాటులో ఉంటామని జితేంద్ర సింగ్ వెల్లడించారు.

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి వర్గాలు, పలు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ వివాదం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.

అయితే, చర్చలు జరపాల్సిన వేదికపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు లేదా నేతల నివాసాల్లో సమావేశమవ్వడానికి నిరసనకారులు సమ్మతించడం లేదు. జంతర్ మంతర్‌ను "ప్రజా న్యాయస్థానం"గా అభివర్ణిస్తున్న విద్యార్థి సంఘాలు, చర్చలు అక్కడే లేదా ఏదైనా తటస్థ ప్రదేశంలో జరపాలని పట్టుబడుతున్నాయి.
Advertisement
Jitendra Singh
NEET Paper Leak
NEET Exam Controversy
Jantar Mantar Protests
Dharmendra Pradhan

More Telugu News