కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం.. చంద్రబాబుపై భూమన తీవ్ర విమర్శలు
- తిరుపతిలో 16 ఎకరాల భూమిని భూమన కబ్జా చేశారనే ఆరోపణలు
- భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
- 21 ఏళ్ళ క్రితమే ఆ భూమిని కొనుగోలు చేశానన్న భూమన
- గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఇవి ఆక్రమణలుగా మీకు కనిపించలేదా అని ప్రశ్న
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపాటు
రాయలసీమలో ఫ్యాక్షన్ శత్రువులు ఒకరి ఆస్తులను ఒకరు ధ్వంసం చేసి రాక్షసానందం పొందినట్లే, సీఎం చంద్రబాబు కూడా తన కుటుంబ ఆస్తులపై దాడి చేయించి తృప్తి పడుతున్నారని భూమన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని, వారి కుటుంబ ఆస్తులను ధ్వంసం చేసే దిగజారుడు రాజకీయాలకు దిగారని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాననే కక్షతో, పగ తీర్చుకోవడానికే ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించిన భూమన... ఈ విధ్వంసాలకు భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. "21 ఏళ్ల క్రితం నేను ఈ ఆస్తులు కొనుగోలు చేశాను. ఈ ఆస్తులు నాటి సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో గానీ, గతంలో మీరు సీఎం ఉన్నప్పుడు గానీ ఆక్రమణలుగా కనిపించలేదా? నా వాణిని గట్టిగా వినిపిస్తున్నందుకే ఈ కక్షసాధింపులు చేస్తున్నారు. నేను ఏనాడూ అవినీతికి, మోసాలకు పాల్పడలేదు. తిరుపతిలో రౌడీ రాజకీయాలకు తావివ్వకుండా జీవితాంతం విలువలతో కూడిన రాజకీయమే చేశాను.
నేను ఆశయాల కోసం బతికేవాడిని తప్ప స్వార్థంతో బతికేవాడిని కాదు. నా కుటుంబ ఆస్తులను ఎంత ధ్వంసం చేసినా మీ తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటా. మీ దాడులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి తప్ప నన్ను వెనక్కి తగ్గించలేవు. 1991లో ప్రారంభించిన హెరిటేజ్ సంస్థ కూడా నది పోరంబోకు స్థలంలోనే ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు" అని భూమన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.