Advertisement

పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్‌..? కేంద్రం క్లారిటీ ఇదిగో!

Suresh Gopi confirms no decision yet on increasing ethanol blending beyond E20
  • శాస్త్రీయ అధ్యయనాల తర్వాతే నిర్ణయమన్న మంత్రి
  • ఈ85 ఇంధనం ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలకే
  • ఈ20 వల్ల ఇంజిన్‌ సమస్యలకు ఆధారాలు లేవన్న సురేశ్‌ గోపీ
  • 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 3 కోట్ల కార్లు ఈ20పై నడుస్తున్నట్లు వెల్లడి
  • ఈ20తో కాలుష్యం తగ్గి పనితీరు మెరుగుపడుతుందని స్పష్టీకరణ
పెట్రోల్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం ఇథనాల్‌ మిశ్రమాన్ని మరింత పెంచే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే ముందు శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.

85 శాతం ఇథనాల్‌, 15 శాతం పెట్రోల్‌తో కూడిన 'ఈ85' ఇంధనాన్ని కేవలం ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల కోసం మాత్రమే ప్రవేశపెట్టామని, ఇది దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతాన్ని పెంచినట్లు కాదని మంత్రి వివరణ ఇచ్చారు. భారత్‌లో ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్‌, ఏఆర్‌ఏఐ, సియామ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, చమురు సంస్థలు తదితర సంస్థల సలహాలతో శాస్త్రీయంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకుపైగా పెట్రోల్‌ కార్లు 'ఈ20' ఇంధనాన్ని వినియోగిస్తున్నప్పటికీ, ఇథనాల్‌ కారణంగా ఇంజిన్‌ దెబ్బతిన్నట్లు లేదా అసాధారణ సమస్యలు తలెత్తినట్లు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని కేంద్రం వెల్లడించింది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ20 వాడుతున్న వాహనాలకు వారంటీ కొనసాగిస్తున్నాయని పేర్కొంది.

ఈ20 ఇంధనం వల్ల కొంతమంది పాత వాహనాల్లో ఇంధన సామర్థ్యం 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, మెరుగైన దహన ప్రక్రియ, తక్కువ కాలుష్యం, మంచి యాక్సిలరేషన్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఇథనాల్‌ మిశ్రమ కార్యక్రమం వల్ల ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 316 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని తెలిపారు. 952 లక్షల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలు తగ్గడంతో పాటు రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని కేంద్రం వెల్లడించింది.
Advertisement
Suresh Gopi
Ethanol blended petrol
E20 fuel India
Flex fuel vehicles
Ministry of Petroleum and Natural Gas
Ethanol blending target

More Telugu News