Somireddy Chandra Mohan Reddy: దాడికి సంబంధించిన ఆధారాలను మీడియాకు విడుద‌ల చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి

  • విజ‌య‌వాడ 18వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ అర‌వ స‌త్యం ఫొటో విడుద‌ల‌
  • వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముఖ్య అనుచ‌రుడు కూడా దాడులు చేశార‌ని ఆరోప‌ణ‌
  • పొనుగంటి స‌త్యంతో పాటు ప‌లువురి ఫొటోలు విడుద‌ల
somireddy slams jagan

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తోన్న దీక్ష కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఇటీవ‌ల త‌మ పార్టీ కార్యాల‌యాలు, నేత‌ల ఇళ్ల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డ వ్య‌క్తులకు సంబంధించిన ఆధారాల‌ను విడుద‌ల చేశారు.

విజ‌య‌వాడ 18వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ అర‌వ స‌త్యం ఈ దాడుల్లో పాల్గొన్నార‌ని తెలుపుతూ ఫొటోల‌ను విడుద‌ల చేశారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముఖ్య అనుచ‌రుడు పొనుగంటి స‌త్యంతో పాటు ప‌లువురి ఫొటోల‌ను కూడా ఆయ‌న మీడియాకు చూపారు.

ఆయా ఘ‌ట‌న‌ల్లో దాడుల‌కు పాల్ప‌డ్డ వారిని వదిలేస్తూ దాడికి గురైన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు. ప్ర‌జ‌ల‌పై హింస‌ను పోలీసులే ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తాము శాంతియుత బంద్‌కు పిలుపునిస్తే త‌మ నేత‌ల‌ను పోలీసు స్టేష‌న్‌ల‌కు తీసుకెళ్లార‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన పోలీసుల తీరును చూస్తుంటే బాధేస్తోంద‌ని, బాధితుల‌నే ముద్దాయిలుగా మార్చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులు పాల్ప‌డిన చ‌ర్య‌లు ఏ రాష్ట్రంలోనూ ఏ పోలీసులూ పాల్ప‌డలేద‌ని అన్నారు. దాడులు చేయించ‌డం త‌ప్ప సీఎం జ‌గ‌న్‌కు మిగ‌తా ఏమీ తెలియ‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.  


        

More Telugu News