చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి కుప్పానికి, ఇప్పటి కుప్పానికి ఎంతో తేడా ఉంది: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari says Kuppam transformed significantly under Chandrababu Naidu leadership
  • కుప్పం పీఎంకే తాండాలో పర్యటించిన నారా భువనేశ్వరి
  • మహిళలు ఏదైనా సాధించగలరని, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచన
  • కుప్పంకు 30 పరిశ్రమలు తెచ్చి వేలాది ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ
  • కృష్ణా జలాలతో కుప్పం నీటి కష్టాలు తీర్చింది చంద్రబాబేనని వెల్లడి
  • కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళుతోందని ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం రామకుప్పం మండలం, పీఎంకే తాండాలో పర్యటించిన ఆమె, స్థానిక మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినందుకు తాండా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి కుప్పానికి, ఇప్పటి కుప్పానికి ఎంతో వ్యత్యాసం ఉందని భువనేశ్వరి గుర్తుచేశారు. నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా, ఒకేసారి 30 పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని, వీటి ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. గతంలో తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిన కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి దశాబ్దాల కలను చంద్రబాబు నెరవేర్చారని, నదుల అనుసంధానంతో సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని తెలిపారు.

మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని, వారిలో ఏదైనా సాధించగల శక్తి ఉందని భువనేశ్వరి ప్రోత్సహించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ పొంది, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. "ఒకప్పుడు వ్యాపారం అంటే నాకూ తెలియదు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం" అని తన అనుభవాన్ని పంచుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవని ఆమె విమర్శించారు. చంద్రబాబు సుపరిపాలన అందిస్తారనే బలమైన నమ్మకంతోనే ప్రజలు కూటమిని ఆశీర్వదించారని అన్నారు. ఎన్నికల హామీలైన ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. పీఎంకే తాండాలో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో రహదారుల నిర్మాణం చేపట్టామని, కమ్యూనిటీ భవనంతో పాటు గోకులం షెడ్లకు, ఓం శక్తి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు భువనేశ్వరి వివరించారు.
Advertisement
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Kuppam development
Andhra Pradesh politics
TDP welfare schemes
Krishna water to Kuppam

More Telugu News