పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్!
- యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి
- అరగంట పాటు ఆసుపత్రిలో గడిపిన వైద్యులు
- మెదడు పనితీరు సాధారణ స్థితికి రావాల్సి ఉందన్న వైద్యులు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. దాదాపు అర్ధగంట పాటు అక్కడే ఉండి వైద్యులను అడిగి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామని, అవసరమైతే విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని కేసీఆర్ కు వైద్యులు వివరించారు. ఆయన అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని, మెదడు పనితీరు సాధారణ స్థితికి రావలసి ఉందని, దీనిపై స్పష్టత రావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని తెలిపారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఎంత ఖర్చయినా సరే మెరుగైన వైద్యం అందించి పూర్తి కోలుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్యుల కృషి, దైవానుగ్రహం, ప్రజల ప్రార్థనలతో ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. "ఏం చేస్తారో ఏమో తెలీదు.. మా పెద్ది సుదర్శన్ రెడ్డిని మాత్రం కాపాడండి" అని వైద్యులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.