ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించండి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

Chandrababu Naidu orders officials to create awareness among farmers on El Nino
  • ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సీఎం
  • ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచన
  • ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉద్యోగుల పనితీరు మారాలని స్పష్టీకరణ 
  • విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం నిపుణుల సేవలు తీసుకోవాలని ఆదేశం
  • పనితీరుపై క్షేత్రస్థాయి అభిప్రాయాలను అధికారులకు వివరించిన సీఎం
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందన్న అంచనాల నేపథ్యంలో, రైతులను అప్రమత్తం చేసి వారికి పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఆయన వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. "ఎల్‌నినో వల్ల ఎదురయ్యే పరిణామాలను రైతులకు స్పష్టంగా వివరించాలి. ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలో సూచిస్తూ, వారిని ప్రత్యామ్నాయ సాగు వైపు ప్రోత్సహించాలి. దీనికోసం ఒక క్యాంపెయిన్ మోడ్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి" అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మారాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు అందడంలో కొంత అంతరం కనిపిస్తోందని అన్నారు. ఇటీవల ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఆయన అధికారుల వద్ద ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దానికి తగ్గట్టుగా ఉద్యోగులు పనిచేయాలని హితవు పలికారు.

రంపచోడవరం విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదువులో టాపర్‌గా ఉన్న విద్యార్థిని చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు సైకో మెట్రిక్ టెస్టులు నిర్వహించాలన్న విద్యాశాఖ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సూచించారు. ఇందుకోసం నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు, ఉపాధ్యాయులకు కూడా అవసరమైన శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
El Nino impact on farmers
Andhra Pradesh agriculture
Alternative crop cultivation
Student mental health
Psychometric tests for students

More Telugu News