Somireddy Chandra Mohan Reddy: ఏపీ గురించి ఎవరూ మాట్లాడటమే లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

AP growth rate is decreased says Somireddy
  • 17 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి మొత్తం ఆగిపోయింది
  • పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి
  • జగన్ కక్ష సాధింపులు, ఏకపక్ష నిర్ణయాలే దీనికి కారణం
రాష్ట్రంలో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి మొత్తం ఆగిపోయిందని విమర్శించారు. హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి పనులన్నీ నిలిచిపోయాయని చెప్పారు. గత టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ది పనులన్నింటినీ ఆపేశారని... కేవలం నవరత్నాలు, కక్ష సాధింపులు మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పరిపాలనే లేదని చెప్పారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమిటనే విషయం గురించి ముఖ్యమంత్రి జగన్ ఆలోచించడం లేదని సోమిరెడ్డి విమర్శించారు. ఆయన నియమించుకున్న సలహాదారులు ఏం చేస్తున్నారో, సీఎంకు ఏం చెపుతున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని చెప్పారు. అసలు ఏపీ గురించి ఎవరూ మాట్లాడుకోవడం కూడా లేదని అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందని చెప్పారు. అన్నిటికీ ముఖ్యమంత్రి కక్ష సాధింపులు, ఏకపక్ష నిర్ణయాలే కారణమని దుయ్యబట్టారు.
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Jagan
YSRCP

More Telugu News