'మా' లొల్లి... నరేశ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వనున్న హీరో రాజశేఖర్!

  • అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణ
  • 'మా' ఎన్నికల నాటి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలు
  • షోకాజ్ నోటీసులు సిద్ధం చేసిన రాజశేఖర్ బృందం 
టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. యూనియన్ లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, అధ్యక్షుడు నరేశ్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని హీరో రాజశేఖర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన నేతృత్వంలోని కొందరు కమిటీ సభ్యులు ఇప్పటికే నోటీసులపై సంతకాలు కూడా చేసినట్టు సమాచారం.

'మా' ఎన్నికల తరువాత, పలుమార్లు రాజశేఖర్, నరేశ్ ల మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు జరుగగా, ప్రమాణ స్వీకారం రోజునే రాజశేఖర్ అలిగారు. నరేశ్ మాట్లాడుతూ, 'నేను... నేను' అని పదేపదే అనడంతో, అందరమూ కలిసున్న కమిటీలో 'మేము' అనకుండా, నేను అనడం ఏంటని రాజశేఖర్ మండిపడ్డారు కూడా. ఆపై పెద్దల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించినా, నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగాయని సమాచారం. ఇక తాజాగా, ఈ షోకాజ్ నోటీసుల వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాలి.
MAA
Rajashekhar
Naresh
Tollywood

More Telugu News