బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులు.. గుజరాత్లో నిందితుడి అరెస్ట్
- సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులతో కలకలం
- నిందితుడు గుజరాత్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
- ట్రాన్సిట్ రిమాండ్పై బీహార్కు తరలిస్తున్న అధికారులు
బీహార్ నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఫోన్ ద్వారా హత్యా బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఈ పరిణామం ఎదురుకావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ముంగేర్ పోలీసుల ప్రత్యేక బృందం, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసి.. అతడు గుజరాత్లో ఉన్నట్లు గుర్తించారు.
గుజరాత్లోని సనంద్ ప్రాంతంలో తలదాచుకున్న శేఖర్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ట్రాన్సిట్ రిమాండ్పై బీహార్కు తరలిస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించడానికి గల కారణాలేంటి? దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
మరోవైపు, బీహార్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సుదీర్ఘ కాలం తర్వాత బీహార్లో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం గమనార్హం. నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా పీఠం అధిష్ఠించారు. ఈ కొత్త ప్రభుత్వంలో అధికార విభజన కూడా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఏకంగా 29 శాఖలను తన వద్దే ఉంచుకోగా, మిత్రపక్షం జేడీయూ నుంచి ఇద్దరు నేతలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. జేడీయూకు మొత్తం 18 శాఖలను కేటాయించారు.