అలిపిరి మార్గంలో 'పెద్ది' పోస్టర్ ప్రదర్శించిన యువతి.. తీవ్ర విమర్శలు
- అలిపిరి వద్ద 'పెద్ది' పోస్టర్ ప్రదర్శించిన యువతి
- సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయిన వ్యవహారం
- భద్రతా సిబ్బంది తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కాలినడక మార్గంలో ఓ యువతి అత్యుత్సాహం తీవ్ర వివాదానికి దారితీసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది' ఘన విజయం సాధించిన సందర్భంగా సదరు యువతి 'పెద్ది - తిరుమల కాలినడక' అని రాసి ఉన్న ఫ్లెక్సీని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రదర్శించింది. అంతటితో ఆగకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వైరల్గా మారింది.
నిబంధనల ప్రకారం తిరుమల పరిసరాల్లో, శ్రీవారి నడకదారుల్లో రాజకీయాలు, సినిమాలు లేదా వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడంపై పూర్తిగా నిషేధం ఉంది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తిరుమల భద్రతా సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలిపిరి వద్ద ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి పంపే సెక్యూరిటీ సిబ్బంది కళ్లెదుటే యువతి అంత పెద్ద ఫ్లెక్సీని ఎలా తీసుకెళ్లి ప్రదర్శించిందని ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని, ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు టీటీడీ భద్రతా విభాగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.