ఏపీ సచివాలయం వద్ద డీఎస్సీ అభ్యర్ధుల నిరసన .. న్యాయం చేయాలంటూ నినాదాలు
- 1:1 నిష్పత్తిలో ఎంపికయ్యామన్న డీఎస్సీ అభ్యర్ధులు
- మంత్రి లోకేశ్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆందోళన
- కాల్ లెటర్స్ చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేసిన అభ్యర్ధులు
"ఇంటర్వ్యూకు హాజరయ్యాం... అభినందించారు కూడా!"
"మేము 1:1 నిష్పత్తిలో ఎంపికయ్యామని చెప్పారు. ఇంటర్వ్యూకు హాజరయ్యాం. అధికారుల ముందు ధ్రువపత్రాలన్నీ సమర్పించాం. ఎంఈఓలు స్వయంగా మమ్మల్ని అభినందించారు. ఉద్యోగం ఖాయమని చెప్పారు. కానీ తుది సెలక్షన్ లిస్టులో మా పేరు లేదు. రిజెక్ట్ లిస్టులో కూడా లేదు. ఏదీ తెలియకుండా మమ్మల్ని మోసం చేశారు" అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి లోకేశ్ను కలవాలని డిమాండ్
సచివాలయం వద్ద నిరసన చేపట్టిన అభ్యర్థులు మంత్రి నారా లోకేశ్ను కలిసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు వచ్చిన కాల్ లెటర్లను చూపిస్తూ, తాము నిజంగానే ఎంపికకు అర్హులమని నినాదాలు చేశారు.
స్పష్టత లేకపోవడమే బాధ
"మా పేర్లు లిస్టులో ఎందుకు లేవో ఎవరూ వివరించడం లేదు. మేము మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారం. ఈ ఉద్యోగమే మా భవిష్యత్ ఆశయం. అధికారుల నిర్లక్ష్యం వల్లే మేము ఇలా అన్యాయం ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించాలి" అంటూ కొందరు అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు.