Advertisement

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తగ్గేదేలే.. చర్చలకు తావులేదు: సీజేపీ

Dharmendra Pradhan resignation demand CJP says no compromise on talks
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదన్న సీజేపీ
  • తదుపరి చర్చలు నిరసన స్థలమైన జంతర్ మంతర్‌లోనే జరగాలని డిమాండ్
  • కేంద్ర మంత్రి నడ్డాతో జరిగిన చర్చలు సమయం వృథా చేశాయని ఆరోపణ
  • సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించాలని సీజేపీ విజ్ఞప్తి
  • ప్రధాన్ అసమర్థత వల్లే పేపర్ లీకులు జరుగుతున్నాయని విమర్శలు
పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని, ఈ డిమాండ్‌పై ఎలాంటి చర్చలకు, రాజీకి తావులేదని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరపాలనుకుంటే, నిరసన జరుగుతున్న జంతర్ మంతర్‌ వద్దకే రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మీడియాతో మాట్లాడారు.

"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా నిరసన కొనసాగుతుంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. అదే సమయంలో, సోనమ్ వాంగ్‌చుక్ గారు తన ప్రాణాలను పణంగా పెట్టడం మాకు ఇష్టం లేదు. దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరం కాబట్టి, ఆయన తన ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని కోరుతున్నాం" అని డిప్కే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్ దీక్ష గురువారం నాటికి 26వ రోజుకు చేరుకుంది.

కేంద్ర మంత్రులతో చర్చల విషయంపై డిప్కే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో చర్చల పేరుతో మమ్మల్ని ఐదు గంటల పాటు ఎదురుచూసేలా చేశారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇది సమయాన్ని వృథా చేయడమే. ఒకవైపు మమ్మల్ని చర్చలకు పిలుస్తూనే, మరోవైపు విద్యార్థులపై దారుణంగా దాడులు చేయించారు. ఇకపై ప్రభుత్వం ఏమైనా మాట్లాడాలనుకుంటే, తదుపరి సమావేశం జంతర్ మంతర్‌లోనే జరగాలి" అని ఆయన అన్నారు.

ఈ ఆందోళనను రాజకీయం చేస్తున్నారన్న నడ్డా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "ఆయనకు రాజకీయాలు అంతగా నచ్చకపోతే, పదవి నుంచి తప్పుకోవచ్చు కదా? ఎన్నికల ర్యాలీలు, ఓట్లు అడిగేది వారు. మేము విద్యార్థులకు న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నాం" అని డిప్కే బదులిచ్చారు.

సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోశ్‌ రంకా మాట్లాడుతూ.. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మా ప్రధాన డిమాండ్. దానిపై చర్చల్లేవు. వ్యవస్థలో పైనుంచి కింది వరకు అసమర్థులు, అవినీతిపరులు తిష్ట వేయడం వల్లే పేపర్ లీకులు జరుగుతున్నాయి. వీరందరి పైన ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఈ సమస్యకు పరిష్కారం లభించదు" అని తీవ్రంగా విమర్శించారు. ఈ ఉద్యమం తమ హక్కుల కోసం పోరాడేలా ఓ తరాన్ని ప్రేరేపించిందని, ఇదే తమ అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Dharmendra Pradhan
Cockroach Janata Party
Paper leak protest
Abhijit Dipke
Sonam Wangchuk
Jantar Mantar protest

More Telugu News