మౌనం ప్రమాదకరం.. నోరు విప్పండి: మంచు లక్ష్మి
- సమాజంలో జరుగుతున్న పరిణామాలపై నోరు విప్పాలన్న మంచు లక్ష్మి
- దేశ సమస్యలపై పట్టనట్టు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వ్యాఖ్య
- వాంగ్చుక్ వంటి యోధులకు సమాజం అండగా నిలవాలని పిలుపు
సమాజంలో జరుగుతున్న పరిణామాలపై పౌరుల మౌనం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నోరు విప్పాలని సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. 'మనకెందుకులే' అని దాటుకెళ్లే మనస్తత్వాన్ని వీడి, ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లడఖ్ రాజ్యాంగ హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు మద్దతు ప్రకటిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక సందేశాన్ని పంచుకున్నారు.
దేశంలో ఏ విపత్తు లేదా సమస్య వచ్చినా తమకేమీ పట్టనట్లు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పనిలేదని.. కనీసం సామాజిక మాధ్యమాల ద్వారానైనా గొంతు కలపడం, విషయాలపై అవగాహన పెంచుకోవడం పౌరులుగా మన బాధ్యత అని గుర్తుచేశారు. నిస్వార్థంగా ప్రజల కోసం పోరాడే వాంగ్చుక్ వంటి యోధులకు సమాజం అండగా నిలవాలని కోరారు.
కేవలం రాజకీయ నాయకులను వేలెత్తి చూపడంతో బాధ్యత తీరిపోదని, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పౌరులు కార్యోన్ముఖులు కావాలని కోరారు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఊరుకోవడం తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.