Volunteers: వాలంటీర్లను వైసీపీ మోసం చేసింది... ఆ జీవోలో వాళ్ల ప్రస్తావనే లేదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan clarifies ob volunteers issue
షార్ట్స్‌లో చూడండి
గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని కూటమి చెప్పినప్పటికీ, సాంకేతిక అంశాలు ఆటంకంగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇవాళ సర్పంచ్ సంఘాల సమావేశానికి పవన్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాలంటీర్లను వైసీపీ దారుణంగా మోసం చేసి నియమించుకుందని ఆరోపించారు. వాలంటీర్లకు ఇచ్చిన మాట నెరవేర్చుదామని భావిస్తుంటే, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఎక్కడా వాలంటీర్ల ప్రస్తావనే లేదని పవన్ స్పష్టం చేశారు. అసలు, దాంట్లో వాలంటీరు ఉద్యోగాలే లేవని అన్నారు. ఇదొక సాంకేతిక సమస్యగా మారిందని విచారం వ్యక్తం చేశారు. 

"గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయన్న అభిప్రాయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేరు. సచివాలయ వ్యవస్థ వేరు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జీతాలు పెంచుదామంటే జీవోలో ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య" అని వివరించారు.

గత ఎన్నికల సమయంలో కూటమి... వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో... పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగానే వారు రాజీనామాలు చేసినట్టు కథనాలు వచ్చాయి. 
Go Back to Shorts
Volunteers
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News