గతంలో కోర్టుకెళ్లిన మీరే.. ఇప్పుడు అవే భూములను ఎలా వేలం వేస్తారు?: సీఎంను ప్రశ్నించిన హరీశ్ రావు

Harish Rao questions CM Revanth Reddy on Raidurg heritage land auction
  • రాయదుర్గం భూముల వేలం తక్షణమే ఆపాలని సీఎంకు హరీశ్ రావు లేఖ
  • అవి వారసత్వ, వివాదాస్పద భూములని లేఖలో స్పష్టీకరణ
  • గతంలో ఇదే భూముల కోసం కోర్టుకెక్కిన రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్
  • యాజమాన్య హక్కులు తేలకుండా వేలం వేయడంపై తీవ్ర అభ్యంతరం
  • ఎస్బీఐ, వక్ఫ్ బోర్డు కేసుల నేపథ్యంలో వేలం నిర్ణయంపై విమర్శలు
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని అత్యంత విలువైన రాయదుర్గంలో 10.63 ఎకరాల వారసత్వ భూమి వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి టి. హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేడు ఓ లేఖ రాశారు. ఆగస్టు 17, 21 తేదీల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించ తలపెట్టిన వేలాన్ని తీవ్రంగా ఖండించారు.

గతంలో ప్రభుత్వ భూములను పూర్వీకులు అందించిన జాతీయ సంపదగా అభివర్ణిస్తూ ఉద్వేగభరిత ప్రసంగాలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అవే భూములను అమ్మకానికి పెట్టారంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ పరిసరాలు, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అమ్మేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ భూముల నుంచి రాయదుర్గంలోని వారసత్వ రాతి ప్రదేశాల వరకు తెలంగాణ విలువైన ప్రజా ఆస్తులకు ప్రమాదం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

"వేలం వేయాలని ప్రతిపాదించిన రాయదుర్గం పాన్‌మక్తా గ్రామంలోని సర్వే నంబర్ 83ని ఇప్పటికే హెరిటేజ్ సైట్‌గా ప్రకటించారు. దీని యాజమాన్య హక్కులపై ఎస్బీఐ, వక్ఫ్ బోర్డు మధ్య న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి కేసులు పరిష్కారం కానప్పుడు థర్డ్ పార్టీ ప్రయోజనాలు కల్పించవద్దని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది" అని హరీశ్ రావు తన లేఖలో గుర్తుచేశారు. 

ఇదే భూముల పరిరక్షణ కోసం 2020లో రేవంత్ రెడ్డి కోర్టులను ఆశ్రయించారని చెప్పారు. "అప్పుడు కోర్టుకెక్కిన మీరే, ఇప్పుడు సీఎం అయ్యాక వివాదాస్పద ఆస్తిపై థర్డ్ పార్టీ హక్కులు ఎలా కల్పిస్తారు?" అని ప్రశ్నించారు.

ఇదే సర్వే నంబర్‌లో గతంలో 6.2 ఎకరాలను ఎకరాకు రూ. 237 కోట్ల చొప్పున వేలం వేయగా, ఆ భూమిపై ఎస్బీఐ యాజమాన్య హక్కులను ప్రకటించిందని, ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉందని హరీశ్ రావు తెలిపారు. ఈ కేసు తేలకుండానే, అదే సర్వే నంబర్‌లోని మరో 10.63 ఎకరాలను వేలం వేయడం పరిపాలనా విచక్షణను, ప్రభుత్వ నిబద్ధతను ప్రశ్నిస్తోందని విమర్శించారు.

భూమి యాజమాన్య హక్కులు చట్టబద్ధంగా తేలే వరకు ఎలాంటి వేలం, బదిలీ, రిజిస్ట్రేషన్ లేదా అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆయన డిమాండ్ చేశారు. వారసత్వ ఆస్తికి సంబంధించిన రికార్డుల గల్లంతుపై విచారణ జరిపించాలని, వక్ఫ్ రికార్డుల మాయంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. భవిష్యత్ తరాల కోసం ఈ విలువైన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Advertisement
Harish Rao
Revanth Reddy
Raidurg land auction
TGIIC Hyderabad
Telangana heritage lands
Hyderabad land disputes

More Telugu News