రూ.25,000 నాణేలతో సెక్యూరిటీ డిపాజిట్‌.. నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి

Independent Jabalpur candidate pays security deposit of Rs 25000 in coins for Lok Sabha Election 2024
  • మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నియోజకవర్గంలో ఆసక్తికర నామినేషన్
  • రూ.10, రూ.5, రూ.2 నాణేల రూపంలో డిపాజిట్ చెల్లింపు
  • కలెక్టర్ ఆఫీస్‌లో డిజిటల్, ఆన్‌లైన్ చెల్లింపుల అవకాశం లేకపోవడంతో నాణేలను ఉపయోగించానన్న అభ్యర్థి
లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా తొలి దశ పోలింగ్‌కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర ఘటన నమోదయింది. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వినయ్ చక్రవర్తి అనే వ్యక్తి రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్‌‌ను నాణేల రూపంలో సమర్పించారు. రూ.10, రూ.5, రూ. 2 నాణేల రూపంలో చెల్లించారు. జబల్‌పూర్ కలెక్టర్ ఆఫీస్‌లో బుధవారం ఈ ఘటన నమోదయింది. డిజిటల్‌, ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేందుకు కలెక్టర్ ఆఫీస్‌లో అవకాశం లేకపోవడంతో తన వద్ద ఉన్న నాణేలనే ఉపయోగించుకున్నట్టు చక్రవర్తి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.

కాగా వినయ్ చక్రవర్తి నాణేల రూపంలో సమర్పించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను స్వీకరించామని జబల్‌పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అభ్యర్థికి రసీదును కూడా జారీ చేశామన్నారు. కాగా ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ బుధవారమే ప్రారంభమైంది.
Go Back to Shorts
Lok Sabha Election 2024
Lok Sabha Polls
Jabalpur
Madhya Pradesh

More Telugu News