తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
- తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య
- తన భార్య, పిల్లలు చాలా మంచివాళ్లు అంటూ సూసైడ్ నోట్
- కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
హైదరాబాద్లోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఈ ఉదయం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న స్వామి అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి పూట విధుల్లో ఉన్న స్వామి, ఉదయం దాదాపు 5.30 గంటల సమయంలో వాష్రూమ్లోకి వెళ్లి తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నాడు. తీవ్ర గాయంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
కానిస్టేబుల్ స్వామి రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య, పిల్లలను ఎవరూ ఏమీ అనొద్దు.. వాళ్లు చాలా మంచివాళ్లు. నేను చనిపోయిన తర్వాత దెయ్యంగా మారైనా సరే నా కుటుంబాన్ని, పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటాను" అని ఆయన తన డైరీలో రాసుకున్న ఆఖరి మాటలు అందరినీ తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.