Nara Lokesh: ఇంకో మంచి స్టోరీ ఏదైనా చెప్పండి... పోలీస్ అధికారికి ఇదే నా సలహా: నారా లోకేశ్

  • రాజంపేట నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • సిద్ధవటంలో భారీ సభ
  • జగన్ కు కోడిగుడ్ల సన్మానం ఖాయమన్న లోకేశ్
  • ఎక్కడికి పారిపోయినా వదిలేది లేదని వెల్లడి
  • సెల్ఫీ ఇవ్వలేదని లోకేశ్ పై కోడిగుడ్ల దాడి అని పోలీసు అధికారి వెల్లడి
  • అబద్ధాలు చెప్పడంలో జగన్ వద్ద ట్రైనింగ్ తీసుకోవాలన్న లోకేశ్
Lokesh slams CM Jagan again

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జనసంద్రంగా మారింది. 121వ రోజు యువగళం పాదయాత్ర చంటిగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా, దారిపొడవునా యువనేతకు మహిళలు, యువకులు, వృద్ధులు ఆత్మీయ స్వాగతం పలికారు. చంటిగారిపల్లె నుంచి ప్రారంభమైన పాదయాత్ర సిద్దవటం, కమ్మపాలెం మీదుగా జంగాలపల్లె విడిది కేంద్రానికి చేరుకుంది. 

సిద్దవటం ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు. శనివారం నాడు యువగళం పాదయాత్ర లంకమల అటవీ ప్రాంతం గుండా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

నీకు కోడిగుడ్లతో సన్మానం ఖాయం!

నా మీద కోడిగుడ్డు వేయించి ఎక్కడికి పారిపోతావ్ జగన్, నువ్వు ఉండాల్సింది ఏపీలోనేగా? ఒక వేళ నువ్వు లండన్ పారిపోయినా నీకు కోడిగుడ్లతో సన్మానం ఖాయం... రాసి పెట్టుకో అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దవటంలో జరిగిన బహిరంగసభలో లోకేశ్ ప్రసంగిస్తూ... క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది... కోడి గుడ్డు బ్యాచ్ కి భయపడతామా? అని స్పష్టం చేశారు. 

"ఏదో ఒక వెధవ పని చెయ్యడం దానికి ఒక కథ అల్లడం జగన్ కి అలవాటు. సెల్ఫీ ఇవ్వనందుకే కోడిగుడ్డు విసిరారు అని ఒక పోలీసు అధికారి ప్రెస్ మీట్ పెడతాడు. అయ్యా అబద్దాలు చెప్పడంలో మీరు జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. నేను ప్రతి రోజూ వెయ్యి మందికి సెల్ఫీలు ఇస్తాను, అదంతా లైవ్ లో వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. ఇంకో మంచి స్టోరీ ఏదైనా చెప్పండి అని ఆ పోలీసు అధికారికి నా సలహా" అని పేర్కొన్నారు.

మోసానికి మానవ రూపం జగన్!

మోసానికి మానవ రూపం జగన్. అందుకే మోసగాడు జగన్ అని పేరు పెట్టా. ఈ మధ్య జరిగిన మూడు ఘటనల గురించి మీకు చెబుతాను. మొదటిది సీపీఎస్ మోసం. ప్రతి సారి చర్చలు అంటూ నమ్మించడం... ఉద్యోగుల గొంతు కొయ్యడం. 3 లక్షల మంది ఉద్యోగులు నష్టపోయేలా ఇప్పుడు మళ్లీ జీపీఎస్ అంటున్నాడు. 

పైగా ఇచ్చిన హామీ నుండి తప్పించుకోవడానికి, జగన్ ఒక అవగాహన లేని వ్యక్తి అని ఏకంగా ప్యాలస్ బ్రోకర్ సజ్జల ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. నేను ఒక్కటే అడుగుతున్నా... మాట తప్పను, మడమ తిప్పను అని బిల్డప్ ఇచ్చావ్ కదా... సీపీఎస్ ఎప్పుడు రద్దు చేస్తావ్? 

రెండోది... పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు. ఎన్నికల ముందు ఇళ్లు కట్టించి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇళ్లు కట్టలేదు అని సుమారు లక్ష మందికి ఇళ్ల పట్టాలు రద్దు చేసాడు. మరో 3 లక్షల మంది పట్టాలు వెనక్కి తీసుకోవడానికి స్కెచ్ వేశాడు. 

ఈయనకి పేదలు అంటే ఎంత కక్షో నిన్నే చూశాను. ఈయన దేశంలోనే ధనిక సీఎం, ఊరికో ప్యాలస్. కానీ సొంత జిల్లా కడపలో పేదలకు సెంటు స్థలం ఎక్కడ ఇచ్చాడో తెలుసా... కనీసం వెళ్ళడానికి రోడ్డు కూడా లేని కొండమీద. 

మూడోది... మార్గదర్శి అంశం. మోసగాడు జగన్ ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అందరి కంపెనీలు నీ కంపెనీల్లా సూట్ కేసు కంపెనీలు కాదు. అసలు మార్గదర్శి మీద ఫిర్యాదే లేదు. వీళ్లు విచారణ అంటూ హడావిడి చేస్తారు. 

అందులో కూడా ఎంత విచిత్రం అంటే విచారణ పూర్తి అయిన తరువాత మంగళవారం రాత్రి సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ ఎండీ శైలజా కిరణ్ గారు విచారణకు సహకరించారు అని చెప్పారు. తాడేపల్లి ప్యాలస్ నుండి కోటింగ్ పడే సరికి స్వరం మారింది. 14 గంటల్లోనే ఆయన కూడా మాట మార్చాడు. విచారణకు సహకరించలేదు అని మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. కక్ష సాధింపుకి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్.

జగన్ ను మించిపోయిన మల్లికార్జున రెడ్డి

2019 ఎన్నికల్లో రాజంపేట రూపురేఖలు మార్చేస్తారని మేడా మల్లికార్జున్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారు. నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలు, ప్రజలకు జరిగిన అన్యాయం తెలుసుకున్న తరువాత స్టేట్ లో ఇంత చేతగాని ఎమ్మెల్యే ఎవరూ ఉండరు అని తేలిపోయింది. అందుకే పేరు మార్చాను అయన మేడా మల్లికార్జున్ కాదు చేతగాని మల్లికార్జున్. 

చేతగాని మల్లిఖార్జున్ బినామీల పేరుతో వేల ఎకరాలు కొట్టేశాడు. చేతగాని మల్లికార్జున్, జడ్పీ ఛైర్మన్ అమర్నాథ్ రెడ్డి కలిసి భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. జగన్ ని ఆదర్శంగా తీసుకుని ఊరుకో ప్యాలస్ కట్టుకున్నారు ఈ ఇద్దరు. 

కష్టాలు చూశాను...కన్నీళ్లు తుడుస్తాను!

నా అక్క, చెల్లెమ్మల కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. ప్రజల కష్టాలు తెలుసుకున్నాకే చంద్రబాబునాయుడు మహానాడులో మినీ మ్యానిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పథకం కింద... ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే..మీ అన్న చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1539 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.1 కి.మీ.*

*122వ రోజు పాదయాత్ర వివరాలు (10-6-2023):*

*బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

ఉదయం

7.00 – జంగాలపల్లె ఆంజనేయస్వామి గుడివద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.20 – లంకమల- కపిలేశ్వరకోన అటవీ ప్రాంతంలో యాత్ర కొనసాగింపు.

10.45 – బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

11.00 – అట్లూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

11.05 – అట్లూరు క్రాస్ వద్ద భోజన విరామం.

సాయంత్రం

4.00 – అట్లూరు క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.30 – రెడ్డిపల్లెలో హార్టీకల్చర్ రైతులతో సమావేశం.

4.45 – కొండూరులో ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం.

5.05 – బాలిరెడ్డి బావి వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

6.20 – నదియాబాద్ విడిది కేంద్రంలో బస.

******

More Telugu News