Nara Lokesh: అలాంటి దుర్మార్గపు ఆలోచన నాకు లేదు: న్యాయవాదులతో లోకేశ్

  • ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • కుప్పగల్లులో లోకేశ్ ను కలిసిన న్యాయవాదులు
  • టీడీపీ గెలిచాక కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తామన్న లోకేశ్
  • జగన్ లా మాయమాటలు చెప్పి మోసం చేయబోమని స్పష్టీకరణ
Advocates met Nara Lokesh in Adoni constituency

ఆదోని నియోజకవర్గం కుప్పగల్లులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో   న్యాయవాదులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... తాము జగన్ లా మాయమాటలు చెప్పి, మోసం చేసేవాళ్లం కాదని స్పష్టం చేశారు. టీడీపీ గెలిచాక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

"మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హైకోర్టు వైజాగ్ లో అంటాడు, జగన్ రాయలసీమ లోనే హైకోర్టు అని మభ్య పెడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం  అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ లా కర్నూలులో ఒక మాట చెప్పి ఢిల్లీలో మరోమాట చెప్పే దుర్మార్గపు ఆలోచన నాకు లేదు. 

నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతున్న జగన్ కర్నూలులో కనీసం స్థలం కేటాయించి, ఒక్క ఇటుక పెట్టాడా? జగన్ చెప్పే అబద్ధాలు తియ్యగా, మేం చెప్పే నిజాలు చేదుగా ఉంటాయి. విజ్ఞులైన న్యాయవాదులు నిజానిజాలను గుర్తించాలి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తాం. 

పరిపాలన అంతా ఒక చోట ఉండాలి, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. న్యాయ విభాగానికి సరైన నిధులు, మౌలిక వసతులు కల్పించకుండా కేసులు పెండింగ్ లో ఉన్నాయని నిందించడం సబబు కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు ఎక్కువగా కేటాయించి, మౌలిక వసతులు మెరుగు పరుస్తాం. 

రాష్ట్రంలో జగన్ చేసిన అరాచకాలను కొంత వరకైనా అడ్డుకోగలిగామంటే అది మీ వల్లే. జూనియర్ లాయర్లకి స్టయిఫండ్ ఇస్తాం. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటాం" అని లోకేశ్ పేర్కొన్నారు. 

More Telugu News