Nara Lokesh: మేం చేసిన అభివృద్ధి ఇవాళ మాకు స్వాగతం పలుకుతోంది: లోకేశ్

  • ఉరవకొండ నియోజకవర్గంలో ముగిసిన యువగళం
  • శింగనమల నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • టీడీపీ హయాంలో వచ్చిన విండ్ మిల్ ఎదుట లోకేశ్ సెల్ఫీ
  • అభివృద్ధికి అంబాసిడర్ టీడీపీ అని వెల్లడి
Lokesh said TDP made development new welcomes everywhere

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 62వ రోజు (గురువారం) ఉరవకొండ నియోజకవర్గంలో విజయవంతంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా జనం పెద్ద ఎత్తున లోకేశ్ ను అనుసరించారు. సంగమేశ్ కాలనీలో యువతీయువకులు గజమాలలతో లోకేశ్ ను ముంచెత్తి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

కూడేరు సంగమేశ్వర జోడు లింగాల స్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ అగ్రనేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గమధ్యంలో అరవకూరు గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేతకు విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ముందుకు సాగారు. కమ్మూరు భోజన విరామస్థలంలో లోకేశ్ ప్రజలతో సమావేశమై వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు.

భోజన విరామానంతరం తిరిగి ప్రారంభమైన పాదయాత్ర కోటంక వద్ద శింగనమల నియోజకవర్గంలో ప్రవేశించింది. శింగనమల ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. 

క‌ర‌వునేల‌పై చంద్రబాబు ఆకుప‌చ్చని సంత‌కం

కూడేరు ప్రాంతంలో డ్రిప్ ద్వారా సాగుచేస్తున్న పచ్చని పొలాలను చూసిన నారా లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనంత‌పురం జిల్లాలో వ‌ర్షపాతం దేశంలోనే అతి త‌క్కువ‌ అని వెల్లడించారు. క‌ర‌వునేల‌లో తాగునీటికీ ఇబ్బందులేనని తెలిపారు. 

నాడు వ్యవ‌సాయానికి ఉపాధి హామీ ప‌థ‌కాన్ని అనుసంధానించామని,. పంట‌కుంట‌లు త‌వ్వించి, చెక్ డ్యాములు నిర్మించి దేశంలోనే అనంత‌పురానికి మొద‌టిస్థానంలో నిలిపామని లోకేశ్ వివరించారు. భూగ‌ర్భజ‌లాలు పెరిగాయని,. డ్రిప్ ప‌రిక‌రాలు స‌బ్సిడీపై అందించామని,. నీటిని పొదుపుగా వాడుకుని రైతులు బంగారు పంట‌లు పండించారని సంతోషంగా చెప్పారు. 

పేదరిక నిర్మూలనే మా లక్ష్యం

పేదరిక నిర్మూలన తమ లక్ష్యం అని లోకేశ్ పునరుద్ఘాటించారు. బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టీడీపీ వల్లనే అని స్పష్టం చేశారు. "బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. జగన్ 10 శాతం తగ్గించి 16,500 పదవులను బీసీలకు దూరం చేసి రాజకీయంగా దెబ్బకొట్టారు. అనేక కార్పొరేషన్ల ద్వారా బీసీలను ఆదుకుంది టీడీపీ. బీసీ సంక్షేమ శాఖ మంత్రికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా... ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందనే దానిపై చర్చకు నేను సిద్దం" అని పేర్కొన్నారు.

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడ‌ర్ తెలుగుదేశం

కూడేరు సమీపంలో టీడీపీ హయాంలో వచ్చిన ఒక విండ్ మిల్ ఎదుట లోకేశ్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ రాష్ట్ర ప్రగ‌తి కోస‌మేనని వెల్లడించారు. 

"మేము చేసిన అభివృద్ధి మ‌మ్మల్ని స్వాగ‌తిస్తోంది. అనంత‌పురం జిల్లాలో పాద‌యాత్ర సాగుతుంటే మేము తీసుకొచ్చిన కంపెనీలు, అవి క‌ల్పించిన ఉపాధి, ఉద్యోగాలు ఎదురై ఎంతో సంతోషాన్నిస్తున్నాయి. కూడేరు వ‌ద్ద క‌నిపిస్తున్న ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని రాష్ట్రానికి తీసుకొచ్చింది మేము అని గ‌ర్వంగా చెబుతున్నాను. నీ నాలుగేళ్ల పాల‌న‌లో గాలి మాట‌లే త‌ప్పించి గాలిమ‌ర‌ల విద్యుత్ ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చావా మిస్టర్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డీ" అంటూ వ్యాఖ్యానించారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 805.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15.5 కి.మీ.*

*63వరోజు (7-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – మార్తాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – పాదయాత్ర 800 కి.మీ అధిగమించిన సందర్భంగా మార్తాడులో శిలాఫలకం ఆవిష్కరణ.

8.55 – మార్తాడు కెనాల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10.20 – బుడేడు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10.55 – గార్లదిన్నెలో భోజన విరామం.

సాయంత్రం

3.00 – గార్లదిన్నె నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.15 – గార్లదిన్నె డ్యామ్ రోడ్డు సర్కిల్ నుంచి స్థానికులతో మాటామంతీ.

3.50 – గార్లదిన్నె బహిరంగసభలో లోకేశ్ ప్రసంగం.

6.20 – జంబులదిన్నె విడిది కేంద్రంలో బస.

More Telugu News