Kodali Nani: వివేకా చనిపోతే జగన్ కు ఏమైనా ఆస్తి లభించిందా?: కొడాలి నాని

  • వివేకా వ్యవహారంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
  • ఆస్తులన్నీ వివేకా భార్య, కూతురు, అల్లుడి పేరుమీదే ఉన్నాయని వెల్లడి
  • వివేకా బతికున్నా ఆ సీటు అవినాశ్ కే ఇచ్చేవారని వివరణ
Kodali Nani opines on Viveka death issue

వివేకా హత్య కేసులో సీఎం జగన్ పై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. వివేకా చనిపోతే జగన్ కు ఏమైనా ఆస్తి లభించిందా? అని ప్రశ్నించారు. ఆస్తులన్నీ వివేకా భార్య, కుమార్తె, అల్లుడి పేర్ల మీదే బదలాయించారని వివరించారు. వివేకా బతికున్నా ఆ సీటును అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. 

జగన్ వైసీపీ స్థాపించాడని, అప్పుడు విజయమ్మపై కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకా పోటీ చేశారని కొడాలి నాని వెల్లడించారు. అయితే అప్పట్లో విజయమ్మను ఓడించడానికి వివేకా కుటుంబం ప్రయత్నించిందని అన్నారు. వివేకా మృతి వల్ల వైసీపీకి లాభించింది ఏమీ లేదని స్పష్టం చేశారు. వివేకా మృతి సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే సీబీఐ విచారణ కోరామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని చెప్పామని వివరించారు.  

వైఎస్ కుటుంబ నాశనం కోరుకునేవారు వివేకా ఫ్యామిలీలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబమే జగన్ వెంట నడిచిందని తెలిపారు. భాస్కర్ రెడ్డి కుటుంబానికే జగన్ టికెట్ ఇస్తారని వెల్లడించారు.

More Telugu News