తమిళనాడు ప్రభుత్వం, సీఎం విజయ్కి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్!
- కరూర్ తొక్కిసలాట ఘటనలో పలువురి మృతి
- మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని విజయ్ ప్రభుత్వ నిర్ణయం
- ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు
- హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.
మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ... ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించడానికి పిటిషనర్లకు గల హక్కును నిలదీసింది.
దారుణమైన ఘటనలో కుటుంబానికి ఆసరాగా ఉండే ఏకైక వ్యక్తి చనిపోయినప్పుడు, వారి పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ స్టే ఉత్తర్వులతో బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు అందించే ప్రక్రియకు మళ్లీ మార్గం సుగమమైంది, ఇది ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఊరటగా నిలిచింది.